భారత ఈక్విటీల్లో తిరిగి పెట్టుబడులు పెడుతున్న ఎఫ్‌పీఐలు!

by Disha Web Desk 12 |
భారత ఈక్విటీల్లో తిరిగి పెట్టుబడులు పెడుతున్న ఎఫ్‌పీఐలు!
X

ముంబై: విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) దేశీయ ఈక్విటీల్లో షేర్లను విక్రయిస్తూ వచ్చారు. స్థిరమైన ఆర్థికవ్యవస్థ, భవిష్యత్తులో వృద్ధికి అవకాశాలు ఎక్కువగా ఉండటం వంటి పరిణామాలతో ఎఫ్‌పీఐలు భారత్‌లో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, గత వారం విదేశీ మదుపర్లు రూ. 7,666 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. అంతకుముందు వారంలో ఎఫ్‌పీఐలు రూ. 3,920 కోట్ల విలువైన నిధులను వెనక్కి తీసుకున్నారు.

అదానీ గ్రూప్ వ్యవహారం నుంచి మార్కెట్లు బయటపడుతున్నాయని, అందుకే విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులను పెడుతున్నట్టు మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. జనవరి నెల నుంచి గత వారం వరకు ఎఫ్‌పీఐలు ఈక్విటీ మార్కెట్లలో రూ. 38,524 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

అనేక దేశాలు అధిక ద్రవ్యోల్బణ నియంత్రణ కోసం వడ్డీ రేట్లను పెంచడంతో పాటు భారత ఈక్విటీల్లో షేర్ల ధరలు ప్రీమియం స్థాయిలో ఉన్నట్టు భావించిన ఎఫ్‌పీఐలు నిధుల ఉపసంహరణకు ఆసక్తి చూపించారు. ఇక, విదేశీ మదుపర్లు ఆటో, ఆటో యాన్సిలరీస్, రియల్టీ రంగాల్లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో షేర్లను విక్రయిస్తున్నారు.



Next Story

Most Viewed