రూ. 31 వేల కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌పీఐలు..!

by Dishanational4 |
రూ. 31 వేల కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌పీఐలు..!
X

ముంబై: విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిని కొనసాగిస్తున్నారు. ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్ల పెంపు వేగాన్ని తగ్గిస్తుందనే సంకేతాలకు తోడు మొత్తం స్థూల ఆర్థిక పరిణామాలపై విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పీఐ) సానుకూలంగా ఉన్నారు. ఈ తరుణంలోనే నవంబర్‌లో ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 31 వేల కోట్లకు పైగా విలువైన షేర్లను కొనుగోలు చేశారు. అంతకుముందు ఆగష్టు, సెప్టెంబర్‌లలో నిధులను ఉపసంహరించుకున్న తర్వాత ఎఫ్‌పీఐలు అక్టోబర్ మూడో వారం నుంచి కొనుగోళ్లను పెంచారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధోరణి ఇలాగే కొనసాగుతుందని, ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా వృద్ధి చెందుతుండటం మరింత మద్దతివ్వనుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికితోడు స్టాక్ మార్కెట్లలో ర్యాలీ, ఇతర దేశాలతో పోలిస్తే భారత ఆర్థికవ్యవస్థ స్థిరంగా ఉండటం, రూపాయి పుంజుకోవడం వంటి కారణాలతో ఎఫ్‌పీఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయని మార్నింగ్ స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. తాజా డిపాజిటరీ గణాంకాల ప్రకారం, నవంబర్‌లో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు భారత ఈక్విటీ మార్కెట్లలో రూ. 31,630 కోట్ల విలువైన నిధులను ఇన్వెస్ట్ చేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ. 1.37 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు.

Next Story

Most Viewed