వారం రోజుల్లో రూ. 22 వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు!

by Disha Web Desk 12 |
వారం రోజుల్లో రూ. 22 వేల కోట్ల ఎఫ్‌పీఐ పెట్టుబడులు!
X

ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ భారత మార్కెట్లో కొనసాగుతున్న ర్యాలీ నేపథ్యంలో విదేశీ మదుపర్లు దేశీయ ఈక్విటీల్లో భారీగా పెట్టుబడులను కొనసాగించారు. ఈ నెల మొదటి వారంలో దాదాపు రూ. 22,000 కోట్ల విలువైన నిధులను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) పెట్టుబడి పెట్టారు. గత కొన్ని వారాలుగా దేశీయ ఆర్థిక వృద్ధి సానుకూలంగా ఉండటం, ఇతర మార్కెట్ల కంటే భారత ఈక్విటీలపై విశ్వాసం పెరగడంతో ఎఫ్‌పీఐలు పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఇటీవల భారత షేర్ మార్కెట్ల రికార్డు ర్యాలీకి ఎఫ్‌పీఐలు కీలక మద్దతు ఇచ్చారు. ఇదే ధోరణి కొనసాగితే జూలై నెలలో అత్యధికంగా విదేశీ నిధులు రావొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అంతకుముందు మేలో రూ. 43,838 కోట్లు, జూన్‌లో రూ. 47,148 కోట్ల కంటే ఎక్కువ నిధులు ఎఫ్‌పీఐలు పెట్టవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు. ఇటీవల అమెరికా ఫెడ్ మరోసారి కీలక రేట్లను పెంచనుందనే సంకేతాల మధ్య రానున్న రోజుల్లో నిధుల ఉపసంహరణకు మొగ్గు చూపవచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్(రిటైల్) హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. డిపాజిటరీ గణాంకాల ప్రకారం, ప్రస్తుతం నెలలో 7వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు మొత్తం రూ. 21,944 కోట్ల విలువైన భారతీయ షేర్లను కొన్నారు.


Next Story

Most Viewed