ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు రూ. 10 వేలు ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్‌కు ఆదేశాలు

by Dishanational1 |
ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు రూ. 10 వేలు ఇవ్వాలని ఫ్లిప్‌కార్ట్‌కు ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఆన్‌లైన్‌లో ఐఫోన్ ఆర్డర్ చేసిన వ్యవహారంలో సమస్య తలెత్తడంతో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి వినియోగదారుల ఫోరమ్ జరిమానా విధించింది. ఓ కస్టమర్ ఆర్డర్‌ని క్యాన్సిల్ చేయడం వల్ల అతను మానసికంగా క్షోభపడ్డాడని, అందుగ్గానూ రూ. 10,000 చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ను ఆదేశించింది. ఇది సేవల లోపమని, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అన్యాయమైన పద్దతులను అవలంభించిందని సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అభిప్రాయపడింది. వివరాల్లోకి వెళ్తే.. 2022, జూలై 10న ముంబై నివాసి తన క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్‌ను ఆర్డర్ చేశాడు. దానికోసం రూ. 39,628 చెల్లించాడు. జూలై 12న ఫోన్ డెలివరీ కావాల్సి ఉండగా, ఆరు రోజుల తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్టు ఫ్లిప్‌కార్ట్ మేసేజ్ పంపించింది. బాధితుడు క్యాన్సిల్ అయిన కారణం గురించి వివరణ కోరగా, తమ ఈ-కార్ట్ డెలివరీ ఏజెంట్ వచ్చినప్పుడు మీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్టు తేల్చి చెప్పింది. దీంతో బాధితులు ఆర్డర్ క్యాన్సిల్ అవడం వల్ల ఆర్థిక నష్టంతో పాటు మానసిక ఇబ్బందికి గురయ్యానని, ఆన్‌లైన్ మోసానికి గురైనట్టు ఫిర్యాదు చేశాడు.

దీనిపై ఫ్లిప్‌కార్ట్.. తమ ప్లాట్‌ఫామ్‌లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలు విక్రయం, సరఫరా చేస్తారు. ఈ విషయంలో డబ్బు వాపసు చేసినట్టు, సమస్య ఫిర్యాదుదారు, విక్రేతకు మాత్రమేనని వివరణ ఇచ్చింది. కానీ, ఫ్లిప్‌కార్త్ ఉద్దేశపూర్వకంగా ఆర్డర్ క్యాన్సిల్ చేసినట్టు వినియోగదారుల కమిషన్ గుర్తించింది. ఆర్డర్ క్యాన్సిల్ అవడం, రీఫండ్ చేయడం, దానిపై ఫిర్యాదుతో మళ్లీ ఆర్డర్ చేయమని ఫ్లిప్‌కార్ట్ కోరింది. ఈ సమయంలో సదరు ఐఫోన్ రూ. 7 వేలు పెరిగింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఫ్లిప్‌కార్ట్ ఇలా వ్యవహరించిందని, దీనివల్ల వినియోగదారుడు ఇబ్బంది పడ్డాడని కమిషన్ పేర్కొంది. దీనికి పరిహారంగా రూ. 10,000, ఖర్చుల కోసం రూ. 3 వేలు చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్‌ని ఆదేశించింది.


Next Story

Most Viewed