చెక్ బౌన్స్ కేసులను ఎదుర్కొనేందుకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు!

by Disha Web Desk 16 |
చెక్ బౌన్స్ కేసులను ఎదుర్కొనేందుకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు!
X

న్యూఢిల్లీ: చెక్ బౌన్స్ కేసులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కేంద్ర ఆర్థిక శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా, చెక్ ఇచ్చిన వ్యక్తుల ఖాతాలో సొమ్ము లేకపోతే, కోర్టు వరకు వెళ్లకుండా అతనికి చెందిన ఇతర అకౌంట్ల నుంచి దశల వారీగా నగదును తీసుకునే విధంగా నిబంధనలను రూపొందించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా చెక్ బౌన్స్ అయిన ఖాతాదారులు మళ్లీ కొత్త అకౌంట్లను ఓపెన్ చేయకుండా నిషేధించాలని పలు వర్గాలను ఆర్థిక శాఖకు సలహాలు వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై చర్చించేందుకు వివిధ వర్గాలతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో చెక్ బౌన్స్ వ్యవహారాలను రుణ ఎగవేతగా పరిగణించాలని నిపుణులు ప్రభుత్వానికి సూచించారు.

దీనివల్ల క్రెడిట్ బ్యూరో సంస్థలు చెక్ బౌన్స్ అయిన ఖాతాదారుడి క్రెడిట్ స్కోర్‌ను తగ్గించడానికి వీలుంటుంది. దీనివల్ల ఖాతాదారులు చెక్ ఇచ్చే సమయంలో జాగ్రత వహిస్తారు. అప్పుడు చెక్ బౌన్స్ కేసులు కోర్టు దాకా వెళ్లకుండా ఉంటాయని నిపుణులు వివరించారు. ఈ ప్రతిపాదన వల్ల వ్యాపారా సంబంధ, ఇతర లావాదేవీలు సులువుగా పూర్తవుతాయి. దీన్ని అమలు చేసేందుకు భారీగా సమాచారాన్ని అనుసంధానం చేయాల్సి ఉంటుందని, ఆటో డెబిట్ నిర్వహణ ప్రమాణాలను ఖచ్చితంగా రూపొందించాలని నిపుణులు తెలిపారు.

కాగా, ప్రస్తుతం కోర్టుల్లో సుమారు 35 లక్షల వరకు చెక్ బౌన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సుప్రీంకోర్టు చెక్ బౌన్స్ వ్యవహారాలు కోర్టు దాకా రాకుండా పరిష్కరించే ప్రత్యామ్నాయాల కోసం సలహాలు, సూచనలు ప్రతిపాదించాలని ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. పలు వర్గాలతో చర్చించిన అనంతరం ఈ కమిటీ పలు సూచనలు చేసింది.

Next Story

Most Viewed