ఆర్థిక బిల్లు- 2023కు లోక్‌సభ ఆమోదం!

by Disha Web Desk 17 |
ఆర్థిక బిల్లు- 2023కు లోక్‌సభ ఆమోదం!
X

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఆర్థిక బిల్లు-2023కి ఆమోదం లభించింది. 64 అధికారిక సవరణలతో బిల్లును కేంద్రం పాస్ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి మొదలయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను ప్రతిపాదనలను అమలు చేసే ఆర్థిక బిల్లు ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించబడింది. సవరణల్లో, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలిక పన్ను ప్రయోజనాలను ఉపసంహరించుకోవడంతో పాటు జీఎస్టీ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి. అలాగే, విదేశీ టూర్ల‌కు క్రెడిట్ కార్డు పేమెంట్స్ విష‌యంలో ఆర్‌బీఐ నిర్ణ‌యం తీసుకుంటుద‌ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ వెల్లడించారు.

అదేవిధంగా నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్‌పీఎస్)ని సమీక్షించేందుకు ఆర్థిక కార్యదర్శి అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేస్తుందని నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీ పెన్షన్ సమస్యకు పరిష్కారం చూపనుంది. 'ప్రభుత్వ ఉద్యోగుల జాతీయ పెన్షన్ సిస్టమ్‌ను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని ప్రతిపాదనలు అందాయి. అందులోని సమస్యలను పరిశీలించడం, ఉద్యోగుల అవసరాలను తీర్చేలా విధానాలను రూపొందించడానికి ఈ కమిటీ ఏర్పాటు ఉంటుందని' ఆర్థిక మంత్రి లోక్‌సభలో తెలిపారు.

ఈ విధానాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అనుగుణంగా రూపొందించబడతాయన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పలు రకాల ఖర్చులను వివరిస్తుంది. ఈ ఖర్చుల నిమిత్తం నిధుల సమీకరణకు ఆర్థిక బిల్లును తెస్తారు. అందులో నిధుల సర్దుబాటుకి కావాల్సిన చట్ట సవరణ ప్రతిపాదనలుంటాయి.

Also Read..

ఈవీల కోసమే ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్న టాటా మోటార్స్!



Next Story

Most Viewed