జనవరిలో 7 శాతం క్షీణించిన భారత ఎగుమతులు!

by Disha Web Desk 17 |
జనవరిలో 7 శాతం క్షీణించిన భారత ఎగుమతులు!
X

న్యూఢిల్లీ: ప్రపంచ గిరాకీ మందగించిన కారణంగా ఈ ఏడాది జనవరిలో భారత ఎగుమతులు క్షీణించాయి. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నెలలో ఎగుమతులు 6.58 శాతం పడిపోయి 32.91 బిలియన్ డాలర్ల(రూ. 2.72 లక్షల కోట్లు)కు చేరుకున్నాయి. ఇదే సమయంలో దిగుమతులు 3.63 శాతం తగ్గి 50.66 బిలియన్ డాలర్లు(రూ. 4.19 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి.

దీంతో వాణిజ్య లోటు 12 నెలల కనిష్టం 17.75 బిలియన్ డాలర్ల(రూ. 1.47 లక్షల కోట్ల)కు చేరుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జనవరి మధ్య దేశ సరుకుల ఎగుమతులు 8.51 శాతం పెరిగి రూ. 30.60 లక్షల కోట్లు చేరుకోగా, దిగుమతులు 21.89 శాతం పెరిగి రూ. 49.88 లక్షల కోట్లు చేరాయని గణాంకాలు తెలిపాయి.

సమీక్షించిన కాలంలో వాణిజ్య లోటు రూ. 19.30 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంజనీరింగ్ వస్తువులు, ఇనుప ఖనిజం, ప్లాస్టిక్, రత్నాభరణాల ఎగుమతులు ప్రతికూల వృద్ధిని చూశాయి. పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బియ్యం, దుస్తులు, రెడీమేడ్ దుస్తుల విభాగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఒత్తిడి, ఆర్థిక మాంద్యం ఆందోళనలు ఉన్నప్పటికీ భారత ఎగుమతులు 2022-23లో మెరుగైన ఎగుమతులను సాధించాయని సీఐఐ జాతీయ కమిటీ ఛైర్మన్ సంజయ్ పేర్కొన్నారు.


Next Story