ఈ ఏడాది రెండంకెల స్థాయిలో పెరగనున్న కమర్షియల్ వాహనాల అమ్మకాలు!

by Disha Web Desk 22 |
ఈ ఏడాది రెండంకెల స్థాయిలో పెరగనున్న కమర్షియల్ వాహనాల అమ్మకాలు!
X

న్యూఢిల్లీ: వాహన రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ ఈ ఏడాది దేశీయ వాణిజ్య వాహనాల పరిశ్రమ అమ్మకాలు రెండంకెల స్థాయిలో పెరగనున్నాయని టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాగ్ అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న వినియోగం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు, ఈ-కామర్స్ వంటి రంగాలు వృద్ధి చెందుతుండటం వంటి సానుకూల పరిణామాల మధ్య అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని ఆయన అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న అధిక ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లు తాత్కాలిక సవాళ్లేనని గిరీష్ అభిప్రాయపడ్డారు. ప్రతికూల ప్రభావాన్ని అధిగమించి పెరుగుతున్న సరుకు రవాణా రేట్లు, విమానయాన రంగంలో పెరుగుతున్న ప్రయాణ ధరలు కమర్షియల్ వాహన పరిశ్రమ విశ్వాస సూచీకి మద్దతిస్తున్నాయన్నారు.

ఇటీవల పరిశ్రమ తయారీ సంఘం సియామ్ గణాంకాల ప్రకారం, జూన్ త్రైమాసికంలో మొత్తం 2,24,512 వాణిజ్య వాహనాల అమ్మకాలతో 112 శాతం వృద్ధి సాదించిందని గిరీష్ ప్రస్తావించారు. ఇటీవల పెరిగిన వడ్డీ రేట్ల ప్రభావం కొంత మాత్రమే ఉందని.. అయితే, ఫైనాన్సింగ్ పరిష్కారాలను అందించేందుకు పరిశ్రమలోని కంపెనీలు ఆర్థిక సంస్థలతో కలిసి పనిచేయడం ద్వారా దీన్ని అధిగమిస్తున్నాయని గిరీష్ వివరించారు. ఇప్పటికే పండుగ సీజన్ ప్రారంభమైంది, దీన్ని బట్టి ప్రతి ఏడాది లాగే ఆగష్టు, సెప్టెంబర్ నుంచి వాణిజ్య వాహనాల అమ్మకాలు మరింత పుంజుకుంటాయని ఆయన వెల్లడించారు.


Next Story

Most Viewed