Ericson: భారత్‌లో టెలికాం యాంటెన్నాల తయారీ ప్రారంభించనున్న ఎరిక్సన్

by S Gopi |

అమెరికాలో ఆర్డర్లు క్షీణించడంతో కంపెనీ భారత్‌లోనే పూర్తిస్థాయిలో తయారీని చేపట్టాలని నిర్ణయించింది.

Ericson: భారత్‌లో టెలికాం యాంటెన్నాల తయారీ ప్రారంభించనున్న ఎరిక్సన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్వీడన్‌కు చెందిన పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. భారత్‌లో కంపెనీ టెలికాం యాంటెన్నాలను తయారు చేయాలని, వాటిని స్థానికంగా విక్రయించడంతో పాటు అంతర్జాతీయంగా మొత్తానికి సరఫరా చేయాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ మంగళవారం ప్రకటనలో తెలిపింది. భారత టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంపెనీల నుంచి 5జీ సేవల కోసం 2023 తర్వాత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో ఎరిక్సన్ కంపెనీకి ప్రధాన మార్కెట్‌గా ఉన్న అమెరికాలో ఆర్డర్లు క్షీణించడంతో కంపెనీ భారత్‌లోనే పూర్తిస్థాయిలో తయారీని చేపట్టాలని నిర్ణయించింది. ఈ ఏడాది జూన్ నాటికి భారత మర్కెట్ కోసం పాసివ్ యాంటెన్నాలను పూర్తిస్థాయిలో స్థానికీకరణ చేయనున్నట్టు కంపెనీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి వీటి తయారీని మెక్సికో, రొమేనియా, చైనాలలో చేపడుతోంది. దేశీయ అవసరాలు తీరిన తర్వాత తయారైన వాటిలో అధిక భాగాన్ని ఎగుమతి చేయనున్నారు. గుర్గావ్‌లోని కంపెనీ భాగస్వామి వీవీడీఎన్ టెక్నాలజీస్‌తో కలిసి యాంటెన్నాల తయారీని చేపట్టనున్నట్టు ఎరిక్సన్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఎరిక్సన్ కంపెనీ 1994 నుంచి భారత్‌లో టెలికాం పరికరాలను తయారు చేస్తోంది.

Next Story