భారత మార్కెట్ కోసం కార్ల తయారీ ప్రారంభించిన టెస్లా

by Dishanational1 |
భారత మార్కెట్ కోసం కార్ల తయారీ ప్రారంభించిన టెస్లా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. దీనికోసం కంపెనీ జర్మనీలోని తన ప్లాంటులో భారత్‌కు ఎగుమతి చేయాల్సిన రైట్-హ్యాండ్ డ్రైవ్ టెస్లా కార్ల ఉత్పత్తిని ప్రారంభించింది. దాదాపు రూ. 16.7 వేల కోట్ల పెట్టుబడితో భారత్‌లో కార్ల తయారీ ప్లాంటు ఏర్పాటు కోసం ఈ నెలాఖరులో టెస్లా బృందం భారత పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో భారత మార్కెట్‌కు అవసరమైన రైట్-హ్యాండ్ డ్రైవ్ కార్ల తయారీ ప్రారంభమైందని, ఈ ఏడాది చివర్లో భారత్‌కు ఎగుమతి అవుతాయని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి టెస్లా పోర్ట్‌ఫోలియోలో ఏ మోడల్‌ను భారత్‌లో మొదట విక్రయిస్తారనే విషయంపై స్పష్టత లేదు. సమాచారం ప్రకారం, జర్మనీలోని బెర్లిన్ ఫ్యాక్టరీలో మోడల్ వై మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. కాగా, ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానంతో కంపెనీలు ఏటా 8 వేల కార్లను దిగుమతి చేయవచ్చు. టెస్లా భారత మార్కెట్ కోసం కేటాయించిన పెట్టుబడుల్లో ఛార్జింగ్ నెట్‌వర్క్ కోసం కూడా ఖర్చు చేయనుంది. అలాగే, స్థానికంగా విడిభాగాలను సేకరించాలని కంపెనీ భావిస్తోంది. చైనా నుంచి తగ్గించి భారత్‌ను అతిపెద్ద సోర్సింగ్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో టెస్లా ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Next Story