ఎరిక్సన్‌కు రూ. 244 కోట్లు చెల్లించాలని లావాకు హైకోర్టు ఆదేశాలు

by Dishanational1 |
ఎరిక్సన్‌కు రూ. 244 కోట్లు చెల్లించాలని లావాకు హైకోర్టు ఆదేశాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ మొబైల్‌ఫోన్‌ల తయారీ సంస్థ లావాకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పేటెంట్ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో స్వీడన్ టెలీ కమ్యూనికేషన్స్ కంపెనీ ఎరిక్సన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2జీ, 3జీ పేటెంట్ల ఉల్లంఘన విషయంలో రూ. 244 కోట్లను ఎరిక్సన్‌కు చెల్లించాలని లావాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఢిల్లీ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎరిక్సన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సల్ 8 పేటెంట్లలో ఏడింటికి చెల్లుబాటు ఉందని పేర్కొంది. ఇందులో 3జీ టెక్నాలజీ ఫీచర్లు, ఎన్‌హ్యాన్స్‌డ్‌ డేటా రేట్స్‌ ఫర్‌ జీఎస్‌ఎం ఎవల్యూషన్‌, అడాప్టివ్‌ మల్టీరేట్‌ స్పీచ్‌ కోడెక్‌ పేటెంట్లు ఉన్నాయి. ఎరిక్సన్‌కు జరిగిన నష్టం నేపథ్యంలో రూ. 244 కోట్లు పరిహారం చెల్లించాలని హైకోర్టు వెల్లడించింది. తీర్పు వచ్చిన రోజు నుంచి పూర్తి చెల్లింపులు పూర్తయ్యేవరకు 5 శాతం వార్షిక వడ్డీ చెల్లించాలని, ఎరిక్సన్‌కు కోర్టు ఖర్చులను కూడా లావానే ఇవ్వాలని వెల్లడించింది. లైసెన్స్ అగ్రిమెంట్ చేసుకోవడంలో లావా విఫలమైందని, చిప్‌సెట్ విలువపై రాయల్టీని లెక్కించాలని కోరిన లావా విజ్ఞప్తిని కోర్టు నిరాకరించింది. పరిశ్రమలో తుది ఉత్పత్తి విలువ ఆధారంగానే రాయల్టీ చెల్లింపు సమంజసమని కోర్టు అభిప్రాయపడింది.



Next Story

Most Viewed