Digital Payments: ప్రధాన నగరాల్లో 74 శాతం డిజిటల్ చెల్లింపులే

by S Gopi |   (  Updated:2025-09-26 18:19:21  IST  )

డిజిటల్ రిటైల్ లావాదేవీల్లో ఎక్కువగా యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయి.

Digital Payments: ప్రధాన నగరాల్లో 74 శాతం డిజిటల్ చెల్లింపులే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయంగా రిటైల్ రంగంలో వినియోగదారులు ఖర్చు చేసే ప్రతి రూ. 100లో రూ. 74 డిజిటల్‌గానే చెల్లింపులు జరుగుతున్నాయని నియోగ్రోత్ సర్వే తెలిపింది. నియోగ్రోత్ 'హౌ ఇండియా పేస్' పేరుతో చేసిన సర్వేలో.. దేశ రిటైల్ రంగంలో చెల్లింపులు అత్యంత వేగంగా మారుతున్నాయని తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో జరిగే రిటైల్ ఖర్చులో 74 శాతం ఇప్పుడు డిజిటల్‌గానే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ఇది 45 శాతంగా ఉంది. డిజిటల్ రిటైల్ లావాదేవీల్లో ఎక్కువగా యూపీఐ చెల్లింపులు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయి. ఈ చెల్లింపులు రోజువారీ ఖర్చులో అత్యంత కీలకంగా మారాయి. కిరాణా స్టోర్లు మొదలుకొని కియోస్క్‌ల వరకు దేశ రిటైలర్లు డిజిటల్ లావాదేవీల విధానాలలో నగదును స్వీకరిస్తున్నారు. ఈ ధోరణి డిజిటల్ మార్గాలను సృష్టించడం ద్వారా ఆర్థికవ్యవస్థలో వేగవంతమైన మార్పులకు కారణమవుతోందని నియోగ్రోత్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అరుణ్ నాయర్ శుక్రవారం ఓ ప్రకటనలో అన్నారు.

దేశ డిజిటల్ చెల్లింపుల అలవాట్లు ఇప్పుడు రోజువారీ జీవితంలో లోతుగా చొచ్చుకుపోయాయని నివేదిక అభిప్రాయపడింది. ఫ్హ్యాష్(83 శాతం) నుంచి కిరాణా సరుకుల సరఫరా (68 శాతం) వరకు డిజిటల్ లావాదేవీలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రధాన నగరాల్లో హైదరాబాద్ (82 శాతం), బెంగళూరు (79 శాతం), పూణే (79 శాతం) డిజిటల్ చెల్లింపుల్లో ముందంజలో ఉండగా, విశాఖపట్నం (76 శాతం), నాగ్‌పూర్ (71 శాతం), చండీగఢ్ (68 శాతం) మెట్రోలను దాటి అగ్రస్థానంలో ఉన్నాయి. మరోవైపు, అహ్మదాబాద్ (60 శాతం), కోల్‌కతా (55 శాతం), జంషెడ్‌పూర్ (54 శాతం), మధురై (52 శాతం), రాజ్‌కోట్ (48 శాతం) వంటి నగరాలు ఇప్పటికీ నగదుపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

Next Story