డిజిటల్ ఇన్‌ఫ్రా, కొత్త తరం సంస్కరణలే ప్రధాన ఎజెండా: నిర్మలా సీతారామన్

by Dishanational1 |
డిజిటల్ ఇన్‌ఫ్రా, కొత్త తరం సంస్కరణలే ప్రధాన ఎజెండా: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు కొత్త తరం సంస్కరణలు తమ ఎజెండాలో అగ్రస్థానంలో ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నిర్వహించిన వికసిత భారత్-2047పై జరిగిన నేషనల్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆర్థిక మంత్రి.. 'ప్రధాని మళ్లీ అధికారంలోకి రావడం వల్ల ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థికవ్యవస్థల్లో ఒకటిగా భారత్ నిలుస్తుంది. సంస్కరణలు ఉత్పత్తికి సంబంధించిన అన్ని రంగాల్లోనూ జరగనున్నాయి. అంటే భూమి, మూలధనం, డిజిటల్ మౌలిక సదుపాయాల్లో ఉంటాయి. డిజిటల్ మౌలిక సదుపాయాలు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి లక్ష్యాలను సాధించదు ' అని వివరించారు.

భారత్ ఇప్పుడు ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థగా చైనాను అధిగమించింది. భూమి, ఉపాధి, మూలధనంతో పాటు డిజిటల్ ఇన్‌ఫ్రా ఆధునిక ఉత్పత్తిలో ఒక కొత్త భాగమవుతుందని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. 'తాము ఏఐ, స్పేస్ రంగాల్లో విస్తరణను చూస్తున్నాం. పాలసీ విధానాల మద్దతు ద్వారా ఇన్నోవేషన్‌లో అత్యున్నత స్థాయికి చేరాలనుకుంటున్నాము. విలువైన లోహాలు, సెమీకండక్టర్ల విషయంలోనూ వేర్‌హౌసింగ్ అవసరాల కోసం కూడా విధానపరమైన మద్దతుకు సిద్ధంగా ఉన్నామని' నిర్మలా సీతారామన్ వివరించారు. అలాగే, పర్యాటకంతో పాటు అపారమైన సామర్థ్యాన్ని కలిగిన లాజిస్టిక్స్ రంగంలో కూడా పెట్టుబడులను పెంచబోతున్నట్లు సీతారామన్ వెల్లడించారు. మూలధన వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చూపుతోంది. పరిశ్రమలు కూడా ప్రయోజనాలకు అనుగుణంగా వృద్ధికి కీలక సహకారం అందించడం సహజమని ఆమె పేర్కొన్నారు.

Next Story

Most Viewed