బంగారం కొనేందుకు వెనకాడుతున్న వినియోగదారులు

by Dishanational1 |
బంగారం కొనేందుకు వెనకాడుతున్న వినియోగదారులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా బంగారం ధరలు కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ. 70,000కి చేరుకోవడంతో సామాన్యులు కొనడానికి భయపడుతున్నారు. గడిచిన నెల రోజుల్లో బంగారం ధర దాదాపు 10 శాతం పెరిగి రూ. 69,200కి చేరింది. పన్నులతో కలుపుకుని మార్కెట్లో రూ. 70 వేలకు పైనే ఉంది. ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పసిడి డిమాండ్ క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాదాపు 100 టన్నుల బంగారం దిగుమతులు జరగ్గా, మార్చి గణనీయంగా పడిపోయింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం గత నెల 25 టన్నులు కూడా దిగుమతి కాలేదు. మే మొదటివారంలో పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయకు కూడా డిమాండ్ ఉండకపోవచ్చని ఆభరణాల వ్యాపారులు భావిస్తున్నారు. ఒకవేళ ఆ సమయానికి బంగారం ధర తగ్గితే డిమాండ్‌ను తీర్చేందుకు వ్యాపారులు సిద్ధమవుతున్నారు. అయితే, తయారీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుందన్నారు. కానీ, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి కావడంతో అధిక నిఘా కూడా బంగారం సరఫరాలో జాప్యం జరుగుతోందని ఆభరణాల వ్యాపారులు వెల్లడించారు.

భారత్‌లో పెళ్లిళ్ల సీజన్‌కు డిమాండ్ స్థిరంగా ఉంది, విలువ పరంగా కొంచెం పెరగవచ్చు. కానీ అధిక ధరలతో కొనుగోలు చేయాల్సిన బంగారం పరిమాణం పడిపోయిందని బులియన్ కన్సల్టెంట్ భార్గవ వైద్య అన్నారు. దశాబ్దం క్రితం బంగారం ధర 10 గ్రాములు రూ. 28,430గా ఉండేది. ప్రస్తుతం 141 శాతం పెరిగింది. ఏటా 9.2 శాతం ధరలు పెరిగాయి. కాబట్టి బంగారంలో అధిక రాబడి క్రమంగా మార్కెట్ డిమాండ్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతానికి ప్రజలు పసిడి కొనేందుకు దూరంగా ఉన్నారు. కానీ ఇతర బంగారం సాధనాలపై పెట్టుబడులకు మాత్రం ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అన్నారు. ఒక విధంగా ప్రస్తుతం బంగారం స్త్రీల కంటే పురుషులను ఎక్కువగా ఆకర్షిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ మొత్తం డిమాండ్‌లో ఆభరణాలకు ఎక్కువ గిరాకీ ఉంది. ఇది కాకుండా సావరిన్ గోల్డ్ బాండ్, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు బంగారు పెట్టుబడిదారులకు మంచి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. ఆభరణాల్లో కూడా తక్కువ క్యారెట్ ఆభరణాలకు ప్రాధాన్యత పెరిగింది. అధిక ధరల వల్ల ఎక్కువ బంగారం కొనడం తగ్గింది. సురేంద్ర మెహతా వివరించారు.


Next Story