Crude Prices: అధిక క్రూడ్ ధరల వల్ల భారీగా పెరగనున్న భారత చమురు దిగుమతి బిల్లు

by S Gopi |

ఇది 2022 తర్వాత అత్యధిక స్థాయి. దీంతో దిగుమతి చేసుకున్న చమురుపై ఎక్కువగా ఆధారపడిన అనేక దేశాలకు ఆందోళన కలిగించింది.

Crude Prices: అధిక క్రూడ్ ధరల వల్ల భారీగా పెరగనున్న భారత చమురు దిగుమతి బిల్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్-యూఎస్ మధ్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ముడి చమురు ధరలు సోమవారం భారీగా పెరిగాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా, సరఫరా భయాలు ముడి చమురు ధరలను బ్యారెల్‌కు దాదాపు 115 డాలర్లకు, ఒకానొక సమయంలో 125 డాలర్ల దగ్గరగా పెంచాయి. ఇది 2022 తర్వాత అత్యధిక స్థాయి. దీంతో దిగుమతి చేసుకున్న చమురుపై ఎక్కువగా ఆధారపడిన అనేక దేశాలకు ఆందోళన కలిగించింది. ముఖ్యంగా 85 శాతం చమురు దిగుమతిపై ఆధారపడిన మనదేశానికి ఇది భారం కానుంది. దీని కారణంగా, ప్రపంచ చమురు ధరలు పెరిగినప్పుడు, భారత్ అదే మొత్తంలో చమురును కొనుగోలు చేయడానికి చాలా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో (2024-25) మనదేశం దాదాపు 137 బిలియన్ డాలర్ల విలువైన 243 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది.

ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100–115 మధ్య ఎక్కువ కాలం కొనసాగితే, మనదేశ చమురు దిగుమతి బిల్లు ప్రతి సంవత్సరం దాదాపు 56–64 బిలియన్ డాలర్లు(మన కరెన్సీలో రూ. 5-5.9 లక్షల కోట్లు) పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల కరెంట్ ఖాతా లోటును పెరుగుతుందని, రూపాయి మరింత బలహీనపడొచ్చు, ద్రవ్యోల్బణం కూడా పెరగడం ద్వారా దేశ ఆర్థికవ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుంది. అయితే, ఇప్పటివరకు ఆ స్థాయి సంక్షోభం లేదని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు. కానీ, మధ్యప్రాచ్యంలో ఘర్షణలు కొనసాగితే పరిస్థితి మరింత ప్రమాదంగా మారుతుంది. అధిక చమురు ధరలు ఇంధన ధరలు, రవాణా ఖర్చులు, మొత్తం ఆర్థిక వృద్ధితో సహా ఆర్థిక వ్యవస్థలోని అనేక భాగాలను ప్రభావితం చేస్తాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం, చమురు సంస్థలు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. దేశంలో తగినంత చమురు సరఫరాలను నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Next Story