క్రెడిట్ స్వీస్ పతనమైతే భారత బ్యాంకింగ్‌కు ఇబ్బందే: జెఫరీస్ ఇండియా!

by Disha Web Desk 17 |
క్రెడిట్ స్వీస్ పతనమైతే భారత బ్యాంకింగ్‌కు ఇబ్బందే: జెఫరీస్ ఇండియా!
X

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల అమెరికాకు చెందిన అతిపెద్ద సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనం మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపింది. అయితే, దానివల్ల భారత బ్యాంకింగ్ పరిశ్రమకు ఇబ్బంది ఉండదని నిపుణులు చెప్పారు. తాజాగా క్రెడిట్ స్వీస్ షేర్ పతనం కొత్త ఆందోళనలను కలిగిస్తోంది. ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ జెఫరీస్ ఇండియా క్రెడిట్ స్వీస్ ప్రభావం భారత బ్యాంకింగ్ వ్యవస్థపై ఎక్కువ ప్రభావం చూపవచ్చని చెబుతోంది.

క్రెడిట్ స్వీస్ ఉనికి భారత బ్యాంకులకు చాలా ముఖ్యమని జెఫరీస్ ఇండియా అభిప్రాయపడింది. దేశీయ డెరివేటివ్స్ మార్కెట్లలో క్రెడిట్ స్వీస్ కార్యకలాపాలు పటిష్ఠంగా ఉన్నాయి. ఒకవేళ క్రెడిట్ స్వీస్ పతనమైతే ద్రవ్య లభ్యత సమస్య ఎదురవుతుందని, వివిధ కంపెనీలు చెల్లింపులను చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాయని జెఫరీస్ ఇండియా అనలిస్ట్ ప్రఖర్ శర్మ అన్నారు.

దేశీయంగా క్రెడిట్ స్వీస్ 2.4 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది. భారత్‌లో సంస్థ 12వ అతిపెద్ద విదేశీ బ్యాంకుగా ఉంది. పైగా బ్యాంకు ఇచ్చే రుణాల్లో 73 శాతం స్వల్ప కాలానికి చెందినవి. ఈ క్రమంలో క్రెడిట్ స్వీస్ వల్ల ప్రతికూలత ఏర్పడితే ద్రవ్య లభ్యత, కంపెనీల చెల్లింపుల్లో ఇబ్బందులు ఉండొచ్చని, దీనిపై ఆర్‌బీఐ పర్యవేక్షణ ఉండాలని జెఫరీస్ పేర్కొంది.

Next Story