Finance Minister: రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని బ్యాంకులను కోరిన నిర్మలా సీతారామన్

by S Gopi |   (  Updated:2024-11-18 15:23:06  IST  )

ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు చాలా ఒత్తిడిగా భావిస్తున్నారని, రుణాలను సరసమైన రేట్లకు అందించాలన్నారు

Finance Minister: రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించాలని బ్యాంకులను కోరిన నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో రుణాలపై అమలు చేస్తున్న వడ్డీ రేట్లను తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు చాలా ఒత్తిడిగా భావిస్తున్నారని, రుణాలను సరసమైన రేట్లకు అందించాలన్నారు. సోమవారం ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఆర్థిక మంత్రి.. ప్రస్తుతం దేశీయ పరిశ్రమను పెంచి, కొత్త సౌకర్యాలలో పెట్టుబడులు పెట్టాలని అవసరం ఉంది. దానికోసం రుణాల రేట్లను తగ్గించడం వల్ల 'వికసిత్ భారత్' ఆకాంక్షను సాధించవచ్చని అన్నారు. భారత్ అనుకున్న వృద్ధిని సాధించాలంటే అన్ని రంగాల అవసరాలను తీర్చగలగాలి. అయితే, వివిధ పరిశ్రమల నుంచి బ్యాంకింగ్ రుణాలపై వడ్డీ చాలా ఒత్తిడి కలిగిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పరిశ్రమల అభివృద్ధికి, సామర్థ్య పెంపునకు బ్యాంకులు మరింత సరసమైన వడ్డీ రేట్లు అందించడం ముఖ్యమని తెలిపారు. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం సామాన్యులను ప్రభావితం చేసే సంక్లిష్టమైన సమస్య అని, వంటనూనెలు, పప్పులతో సహా సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె అన్నారు. అయినప్పటికీ, సరఫరా సమస్యలు ఉన్నాయని, దీన్ని అధిగమించేందుకు నిల్వ సౌకర్యాలను మెరుగుపరచడంపై ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

Next Story