Paytm: పేటీఎంలో మొత్తం వాటా విక్రయిస్తున్న యాంట్ గ్రూప్

by S Gopi |

ఒక్కో షేర్ ధరను ఫ్లోర్‌ప్రైస్ రూ. 1,020తో విక్రయించనున్నట్టు సమాచారం.

Paytm: పేటీఎంలో మొత్తం వాటా విక్రయిస్తున్న యాంట్ గ్రూప్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫిన్‌టెక్ కంపెనీ పేటీఎంలో ఉన్న మిగిలిన వాటాను విక్రయించడం ద్వారా చైనాకు చెందిన యాంట్ గ్రూప్ పూర్తిగా నిష్క్రమించాలని భావిస్తోంది. బ్లాక్ డీల్స్ ద్వారా యాంట్ గ్రూప్ తనకున్న 5.4 శాతం వాటాను విక్రయించనుంది. ఈ ప్రక్రియను గోల్డ్‌మాన్ శాక్స్ ఇండియా సెక్యూరిటీస్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా నిర్వహించనుంది. ఈ వాటా విలువ రూ. 3,800 కోట్లకు చేరుకోవచ్చు. ఒక్కో షేర్ ధరను ఫ్లోర్‌ప్రైస్ రూ. 1,020తో విక్రయించనున్నట్టు సమాచారం. పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ నుంచి గత రెండేళ్లలో అనేక పెట్టుబడి సంస్థలను కోల్పోయింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, వారెన్ బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాథ్‌వే, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఇదివరకు తమ వాటాలను విక్రయించాయి. ఇక, యాంట్ గ్రూ సైతం 2023లో 10.3 శాతం, ఈ ఏడాది మే నెలలో 4 శాతం వాటాలను అమ్మేసింది. ఇప్పుడు మిగిలిన వాటాలను కూడా విక్రయించేస్తోంది. అయితే, దీనికి సంబంధించి పంపిన మెయిల్స్‌కు యాంట్ గ్రూప్ గానీ, పేటీఎం గానీ స్పందించలేదు. సోమవారం మార్కెట్లు ముగిసే సమయానికి పేటీఎం షేర్ ధర స్వల్ప లాభంతో రూ. 1,079.90 వద్ద ముగిసింది.

Next Story