IRCTC నుంచి స్పెషల్ ప్యాకేజ్‌తో చార్‌ధామ్ యాత్ర

by Disha Web Desk 17 |
IRCTC నుంచి స్పెషల్ ప్యాకేజ్‌తో చార్‌ధామ్ యాత్ర
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి తగ్గిన తరువాత క్రమంగా దేశవ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. దీంతో IRCTC వరుసగా కొత్త కొత్త టూర్ ప్యాకేజ్‌లను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) చేయాలనుకునే వారికోసం ప్రత్యేకంగా ఒక ప్యాకేజ్‌ను తెచ్చింది.

హిమాలయాల్లో ఉండే హిందూ దేవాలయాలు అయినటువంటి కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి నాలుగు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను కలిపి ‘చార్‌ధామ్’ అంటారు. చలికాలంలో మంచుతో కప్పబడిన గుళ్ళు ఎండాకాలంలో భక్తుల సందర్శనకు అనుకూలంగా ఉంటాయి. దీంతో ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని న్యూఢిల్లీ నుంచి ప్రారంభించింది.


ఈ టూర్‌లో భాగంగా కేదార్‌నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ప్రదేశాలను చూసి రావచ్చు. IRCTC దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మే 1, మే 15, జూన్ 1, జూన్ 15, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 15 తేదీల్లో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఈ యాత్ర 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగుతుంది. ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో ఈ టూర్ ప్రారంభమవుతుంది. పర్యాటకులు గుర్తించుకోవాల్సిన విషయం ఎంటంటే చార్‌ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


* ఈ యాత్ర మొదటి రోజు ఢిల్లీ నుంచి ప్రారంభమవుతుంది. రోడ్డు మార్గంలో హరిద్వార్ వెళ్తారు. రెండో రోజు హరిద్వార్ నుంచి బార్‌కోట్ వెళ్తారు. తర్వాత మూడో రోజు ఉదయం యమునోత్రి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయం బేస్ పాయింట్ వద్ద పోనీ & పల్లకీ సేవలను బుక్ చేసుకోవచ్చు. లేదంటే ట్రెక్కింగ్ ద్వారా కూడా ఆలయానికి చేరుకోవచ్చు.



* నాలుగో రోజు హోటల్‌లో చెక్ అవుట్ తర్వాత ఉత్తరకాశీకి వెళ్తారు. ఆ మార్గంలో బ్రహ్మఖల్ సమీపంలోని ప్రకటేశ్వర్ - మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అదే రోజు సాయంత్రం కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఆ రాత్రికి ఉత్తరకాశీలో బస చేయాలి.


* ఐదో రోజు గంగోత్రి బయల్దేరాలి. భగీరథి నది గుండా ఈ ప్రయాణం సాగుతుంది. గంగోత్రి ఆలయంలో గంగాదేవి దర్శనం ఉంటుంది. తిరిగి ఆరో రోజు గుప్తకాశీ/సీతాపూర్ వెళ్తారు. ఏడో రోజు ఉదయం సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ జర్నీ మొదలవుతుంది. 16 కి.మీ లు ట్రెక్కింగ్/ పల్లకిలు/ గుర్రాల ద్వారా సాయంత్రం కేదార్‌నాథ్ ఆలయాన్ని చేరుకుంటారు. ఆ రోజు ఆలయాన్ని దర్శించుకుని రాత్రికి కేదార్‌నాథ్‌లో బస చేయాలి.



* ఎనిమిదో రోజు కేదార్‌నాథ్ అలయంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత గుప్తకాశీ బయల్దేరాలి. తొమ్మిదో రోజు ఉదయం బద్రీనాథ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఆ రోజు సాయంత్రం బద్రీనాథ్ చేరుకుంటారు. దారిలో జోషీమఠ్‌లో నర్సింగ్ స్వామి ఆలయాన్ని దర్శించుకోవచ్చు.


* పదో రోజు ఉదయం బద్రీనాథ్ ఆలయంలో తిరిగి దర్శనం ఉంటుంది. తర్వాత రుద్రప్రయాగ్ బయల్దేరాలి. పదకొండో రోజు హరిద్వార్‌ చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేశాక, పన్నెండో రోజు హరిద్వార్‌ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు.

టూర్ ప్యాకేజీ ధరలు

* సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.88,450, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.62,790, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 59,360. ఈ యాత్రలో AC 2 x 2 వెహికల్‌లో ప్రయాణం, అల్పాహారం, రాత్రి భోజనం, హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, రోజుకు 1 లీటర్ వాటర్ బాటిల్ మొదలైనవి ఉంటాయి. ప్యాకేజ్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Next Story

Most Viewed