గోధుమలను దిగుమతి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం!

by Disha Web Desk 16 |
గోధుమలను దిగుమతి చేసుకునే యోచన లేదని స్పష్టం చేసిన ప్రభుత్వం!
X

న్యూఢిల్లీ: భారత్ త్వరలో గోధుమలను దిగుమతి చేసుకుంటున్నట్టు వస్తున్న కథనాలను కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఖండించింది. దేశీయ అవసరాల కోసం సరిపడా గోధుమల నిల్వలు ఉన్నాయని, దిగుమతి చేసుకునే ఆలోచన ఏ మాత్రం లేదని మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. దేశీయ అవసరాలకు సరపడా నిల్వలు ఉన్నాయని, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) వద్ద తగినంత స్టాక్ ఉందని వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నాటికి ఎఫ్‌సీఐ గౌడౌన్‌లలో గోధుల నిల్వలు 134 లక్షల టన్నులు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.

ఇటీవల భారత్‌లో గోధుమల ఉత్పత్తి దాదాపు 3 శాతం క్షీణించి 10.67 కోట్ల టన్నులకు చేరుకోవచ్చని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనాలు వేసింది. ఉత్తరాది రాష్ట్రాలైనా పంజాబ్, హర్యానాలో వేడిగాలుల కారణంగా గోధుల ఉత్పత్తి తగ్గిపోయింది. అయినప్పటికీ సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన 2021-22 ముందస్తు అంచనా ప్రకారం, వరి, మొక్కజొన్న, శనగలు, పప్పుధాన్యాలు, ఆవాలు, నూనె గింజలు, చెరకు రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదవుతుందని పేర్కొంది. కాగా, గత వారం మిల్లర్స్ ఫెడరేషన్ సభ్యులు ఆహార కార్యదర్శి సుధాన్‌షు పాండేతో గోధుమల ధరల పెరుగుదల, కొరతపై చర్చించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, గత కొన్ని రోజులుగా గోధుల లభ్యత లేకపోవడం, ధరలు విపరీతంగా పెరగడంపై పరిశ్రమల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. గత 15 రోజుల్లో గోధుమ ధర క్వింటాల్‌కు రూ. 300-350 పెరిగిందని ఫెడరేషన్ అధ్యక్షుడు అంజనీ అగర్వాల్ వెల్లడించారు.


Next Story

Most Viewed