త్వరలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం!

by Disha Web Desk 17 |
త్వరలో బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని విధానం!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారానికి ఐదు రోజుల పని దినాలను కేంద్రం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) ఈ డిమాండ్‌పై ప్రభుత్వానికి ప్రతిపాదనను అందించింది. వేజ్‌బోర్డు సవరణతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం బ్యాంకులు ప్రతి నెలా రెండు, నాలుగో శనివారాలు సెలవు పాటిస్తున్నాయి. వారానికి ఐదు రోజుల పని విధానం కావాలని ఉద్యోగులు ఎప్పటినుంచో కోరుతున్నప్పటికీ కరోనా మహమ్మారి సమయంలో బ్యాంకు ఉద్యోగుల సంఘం నుంచి డిమాండ్ మరింత పెరిగింది. కానీ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) దానికి బదులుగా వేతనాలను 19 శాతం పెంచుతామని చెప్పింది. అయితే, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్స్ యూనియన్స్(యూఎఫ్‌బీయూ) దానికి అంగీకరించలేదు. వారానికి ఐదు రోజుల పని విధానంతో పాటు పెన్షన్ అప్‌డేట్, ఇతర డిమాండ్లను కోరుతూ ఈ ఏడాది జనవరిలో రెండు రోజుల సమ్మె నిర్వహించింది.

అయితే, ఇతర కారణాలతో సమ్మెను వాయిదా వేసింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఐబీఏ వారానికి ఐదు రోజుల పని విధానంపై చర్చలు జరుపుతున్నామని, అలాగే ఉద్యోగుల రోజువారీ పనిగంటలను 40 నిమిషాలు పెంచనున్నట్టు తెలిపింది. దీనికి బ్యాంకు సంఘాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే ఐబీఏ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనికి ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తే బ్యాంకు సమయం ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉండొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి.



Next Story

Most Viewed