రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కొత్త పోర్టల్‌తో ఈజీగా రూ.3 లక్షల లోన్

by Disha Web Desk 17 |
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. కొత్త పోర్టల్‌తో ఈజీగా రూ.3 లక్షల లోన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు సులభంగా రుణాలు పొందడానికి కొత్తగా ఒక పోర్టల్‌ను ప్రారంభించింది. దాని పేరు ‘పీఎం కిసాన్ రుణ పోర్టల్ (PM Kisan Rin Portal)’. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రారంభించారు. దేశంలో రైతులకు అందిస్తున్న రుణాలు, వడ్డీ, పథకాలకు సంబంధించిన వివరాలను ఈ సైట్‌లో అందించారు. అలాగే రుణాలు కావాలనుకునే వారు నేరుగా ఈ సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుతం రైతులకు రుణాలు ఇవ్వడానికి ఎలాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదు. దీంతో చాలా కాలంగా రైతులు రుణాలు, పథకాలకు సంబంధించిన వివరాల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యను గమనించిన కేంద్రం ఈ డిజిటల్ సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త పోర్టల్‌లో 97 కమర్షియల్ బ్యాంకులు, 58 రీజనల్ రూరల్ బ్యాంకులు, 512 కోఆపరేటివ్ బ్యాంకులు రైతులకు రుణాలు అందించడానికి సిద్ధంగా ఉంటాయి.

పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగిన వారికి ఈ పోర్టల్ ద్వారా తక్కువ వడ్డీ రేటుకే రూ.3 లక్షల లోన్ పొందవచ్చు. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు లేని వారికి కార్డులను ఇవ్వడానికి కేంద్రం ఇంటింటి ప్రచారం కూడా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనిని అక్టోబరు 1 నుంచి ప్రారంభించనుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌లో ప్రతి రైతు చేరేలా ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది.

వడ్డీ వ్యాపారుల నుంచి ఎక్కువ వడ్డీకి రుణాలు తీసుకోకుండా బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకే రుణాలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నాబార్డ్ కలిసి 1998 లో రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్‌ను ప్రారంభించింది. రుణాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://fasalrin.gov.in/ వెబ్‌సైట్‌ చూడగలరు.

Next Story

Most Viewed