ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం

by Dishanational1 |
ఇకపై అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం
X

దిశ, బిజినెస్ బ్యూరో: జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్(జీఐసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య బీమా తీసుకున్న వారికి అన్ని ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణ, ఆరోగ్య బీమా కంపెనీలతో సంప్రదింపులు జరిపిన తర్వాత, గురువారం నుంచే ఇది అమల్లోకి వచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన సందర్భంలో సంబంధిత బీమా కంపెనీ ఒప్పందం లేదా టై-అప్‌లను కలిగి ఉన్న ఆసుపత్రులలో మాత్రమే క్యాష్‌లెస్ సౌకర్యం అందుబాటులో ఉంది. దీన్ని, 'క్యాష్‌లెస్ ఎవ్రీవేర్' కార్యక్రమం కింద బీమా పాలసీ నెట్‌వర్క్ పరిధిలో లేని ఆసుపత్రుల్లో సైతం క్యాష్‌లెస్ సదుపాయం వినియోగించేందుకు ఇప్పుడు వీలుంది. ఇకపై పాలసీదారులు తాము ఎంచుకున్న ఏ ఆసుపత్రిలోనైనా చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. దీనికోసం నెట్‌వర్క్ జాబితాలో లేని ఆసుపత్రిలో క్యాష్‌లెస్ సదుపాయం పొందడానికి 48 గంటల ముందు బీమా కంపెనీకి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అత్యవసర సందర్భాల్లో ఆసుపత్రిలో చేరిన 48 గంటల తర్వాత వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. బీమా పాలసీ నిబంధనలు, షరతుల ప్రకారం క్లెయిమ్ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం నెట్‌వర్క్ జాబితాలో లేని ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే సొంతంగా డబ్బు చెల్లించాలి. ఆ తర్వాత రీయంబర్స్‌మెంట్ కోసం ధరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పాలసీదారులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


Next Story