2023 ఆఖరులోగా ఆదాయ వివరాలు వెల్లడించనున్న బైజూస్!

by Dishafeatures2 |
2023 ఆఖరులోగా ఆదాయ వివరాలు వెల్లడించనున్న బైజూస్!
X

బెంగళూరు: ప్రముఖ ఎడ్‌టెక్ దిగ్గజం బైజూస్‌ ఆడిటర్‌ బాధ్యతల నుంచి డెలాయిట్‌ హస్కిన్స్‌ అండ్‌ సెల్స్‌ వైదొలగిన నేపథ్యంలో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 2022 ఏడాదికి సంబంధించిన కంపెనీ ఆదాయ వివరాలను సెప్టెంబర్‌లోగా, 2023 ఫలితాలను డిసెంబర్‌లోగా దాఖలు చేయనున్నట్టు పెట్టుబడిదారులకు తెలియజేసింది. ఇటీవల డెలాయిట్ 2022, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఆర్థిక వివరాలను వెల్లడించడంలో ఆలస్యం చేసిందనే కారణంతో కాంట్రాక్ట్ ముగియముందే తప్పుకుంది. డెలాయిట్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే బైజూస్ తాజా నిర్ణయం తీసుకుంది.శనివారం బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అజయ్ గోయెల్‌తో సహా సంస్థ కీలక ఉద్యోగులతో ఆర్థిక వ్యవహారాల గురించి ఆందోళనలను పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించారు.

సుమారు 75 మంది వాటాదారులకు సంబంధిత విషయాల గురించి వివరించినట్టు తెలుస్తోంది. 2021-22 ఆడిట్ వివరాలను సెప్టెంబర్‌లోగా, 2022-23 ఆదాయ వివరాలను ఏడాది ఆఖరులో సమర్పించనున్నట్టు గోయెల్ ఇన్వెస్టర్లు స్పష్టం చేసినట్టు సమాచారం. కాగా, డెలాయిట్ సంస్థ ఆడిట్ బాధ్యతల నుంచి తప్పుకున్న రోజే కంపెనీ బోర్డుకు ఒకేసారి ముగ్గురు కీలక సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కంపెనీ నిర్వహణలో రవీంద్రన్‌తో ఉన్న విభేదాలే కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.



Next Story

Most Viewed