వరుసగా ఐదో సెషన్‌లో కొత్త రికార్డు గరిష్ఠాలకు సూచీలు

by Disha Web Desk 16 |
వరుసగా ఐదో సెషన్‌లో కొత్త రికార్డు గరిష్ఠాలకు సూచీలు
X

ముంబై: భారత షేర్ మార్కెట్లో వరుస రికార్డుల ర్యాలీ కొనసాగుతోంది. గురువారం సైతం సూచీలు కొత్త జీవితకాల గరిష్ఠాలకు చేరాయి. ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పటి నుంచే పుంజుకున్న మార్కెట్లు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల మద్దతు, అమెరికా ఫెడ్ వచ్చే ఏడాదిలో కీలక రేట్లలో కోత విధించనున్న సంకేతాలు వరుసగా ఐదో సెషన్‌లో మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగించడం, దేశీయంగా కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు కారణంగా సెన్సెక్స్ 72,484ని, నిఫ్టీ 21,801 మార్కు వద్ద ఆల్‌టైమ్ రికార్డులను తాకాయి. ముడిచమురు ధరలు 80 డాలర్ల వద్దే కొనసాగడం, ఆసియా మార్కెట్లలోనూ వడ్డీ రేట్ల కొత అంచనాలు కలిసొచ్చాయి.

మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 371.95 పాయింట్లు ఎగసి 72,410 వద్ద, నిఫ్టీ 123.95 పాయింట్లు లాభపడి 21,778 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా, హెల్త్‌కేర్, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాలు 1 శాతానికి పైగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, టాటా మోటార్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్ కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. ఎల్అండ్‌టీ, విప్రో, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.20 వద్ద ఉంది.



Next Story

Most Viewed