మరో ఐదేళ్లలో పూర్తిస్థాయి బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్

by Dishanational1 |
మరో ఐదేళ్లలో పూర్తిస్థాయి బ్యాంకుగా ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: గతవారం ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకును విలీనం చేసుకునేందుకు ఆర్‌బీఐ ఆమోదం పొందిన ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ భవిష్యత్తు వృద్ధిపై దృష్టి సారిస్తోంది. రాబోయే 3-5 సంవత్సరాల్లో పూర్తిస్థాయి బ్యాంకుగా మారాలనే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. 'ఈ ఏడాది విలీనానికి సంబంధించి వ్యాపార స్థిరత్వాన్ని కలిగి ఉండే చర్యలు తీసుకుంటాం. అలాగే, విలీన తర్వాత ఎదుర్కొనబోయే టెక్నాలజీ పటిష్టత, ఉద్యోగుల నిర్వహణ, సేవలు, కస్టమర్ సేవలు, ఆఫర్‌ల వంటి సంక్లిష్ట సమస్యలను తమ యాజమాన్యం ఎంత సమర్థవంతంగా నిర్వహించగలదో నిరూపించుకోవాలని ఆశిస్తున్నట్టు' ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈఓ సంజయ్ అగర్వాల్ చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి(విలీనం అమల్లోకి వచ్చే తేదీ) ఫిన్‌కేర్ బ్రాంచులు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఔట్‌లెట్‌లుగా మారనున్నప్పటికీ, మొత్తం విలీన ప్రక్రియ ముగిసేందుకు మరో 9-12 నెలల సమయం పడుతుంది. గత 28 ఏళ్లలో మేము ఎదిగిన తీరు ద్వారా త్వరలో బ్యాంకింగ్ లైసెన్స్ పొందుతామనే విశ్వాసం ఉంది. ఖచ్చితంగా 3-5 ఏళ్లలో దీన్ని సాధించగలమని సంజయ్ అగర్వాల్ పేర్కొన్నారు. విలీనం అమలు తర్వాత మొత్తం వ్యాపార విలువ రూ. 1.8 లక్షల కోట్లను దాటుతుంది. మొత్తం కోటి కంటే ఎక్కువ వినియోగదారులతో పాటు 43,500 కంటే ఎక్కువమంది ఉద్యోగులు, 2,350కి పైగా భౌతిక టచ్‌పాయింట్ల నెట్‌వర్క్‌లు, 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరణ కలిగి ఉంటాం. మొత్తం డిపాజిట్ల విలువ రూ. 89,854 కోట్లకు చేరుకుంటుందని ఆయన వివరించారు. 2023, డిసెంబర్ ఆఖరు నాటికి బ్యాంకు బ్యాలెన్స్ షీట్ సైజ్ రూ. 1,16,695 కోట్లుగా ఉందని పేర్కొన్నారు.


Next Story

Most Viewed