OpenAI: ఓపెన్ ఏఐ టాప్ మార్కెట్‌గా భారత్

by S Gopi |   (  Updated:2025-08-08 15:31:24  IST  )

త్వరలో యూఎస్‌ను దాటి భారత్ అగ్రస్థానాన్ని సొంతం చేరుకోగలదని అన్నారు.

OpenAI: ఓపెన్ ఏఐ టాప్ మార్కెట్‌గా భారత్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ఏఐ రంగంలో సంచలనం సృష్టించిన ప్రముఖ ఓపెన్ఏఐ సంస్థ తాజాగా కీలక చాట్‌జీపీటీకి అడ్వాన్స్‌డ్ మోడల్‌ను విడుదల చేసింది. జీపీటీ-5 పేరుతో లాంచ్ చేసిన ఈ మోడల్ రైటింగ్, హెల్త్‌కేర్, కోడింగ్ వంటి కీలక రంగాల్లో అత్యుత్తమ పనితీరు కలిగి ఉంటుందని ఓపెన్ఏఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో చాట్‌జీపీటీ-5 విడుదల కార్యక్రమంలో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఏఐ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్రకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమెరికా తర్వాత భారత్ తమకు రెండో అతిపెద్ద మార్కెట్ అని, త్వరలో యూఎస్‌ను దాటి భారత్ అగ్రస్థానాన్ని సొంతం చేరుకోగలదని అన్నారు. 'భారత్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఆ దేశంలో చాలామంది, వ్యాపారాలు ఏఐని సృజనాత్మకంగా ఉపయోగిస్తున్న విధానం ప్రశంసించే స్థాయిలో ఉంది. ఓపెన్ఏఐ కూడా భారతీయ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. స్థానిక భాగస్వామ్యం ద్వారా మరింత చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌ను సందర్శించాలని భావిస్తున్నట్టు' ఆల్ట్‌మన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఓపెన్ ఏఐ ఇప్పటివరకు తయారుచేసిన అత్యంత శక్తిమంతమైన మోడల్‌ చాట్‌జీపీటీ-5 అని, ఇది వేగం, విశ్లేషణ సామర్థ్యాల్లో మునుపటి మోడళ్ల కంటే చాలా మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది. పూర్తిస్థాయిలో ఓ సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్‌గా, పీహెచ్‌డీ స్థాయిలో సమాధానం ఇస్తుంది. చాట్‌జీపీటీ ఉచిత వెర్షన్ వాడే వారితో సహా అందరికీ ఉన్నత స్థాయి సామరథ్యంతో కూడిన యూజర్ అనుభవాన్ని జీపీటీ-5 ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఏపీఐ ప్లాట్‌ఫామ్‌లో ఇది జీపీటీ-5, జీపీటీ-5 మినీ, జీపీటీ-5 నానో వంటి మూడు సైజుల్లో అందుబాటులో ఉంటుందని ఓపెన్ఏఐ పేర్కొంది.

Next Story