అశోక్ లేలాండ్ 'బడా దోస్త్' లిమిటెడ్ ఎడిషన్ వాహనాల విడుదల!

by Dishanational4 |
అశోక్ లేలాండ్ బడా దోస్త్ లిమిటెడ్ ఎడిషన్ వాహనాల విడుదల!
X

న్యూఢిల్లీ: ప్రముఖ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలాండ్ తన బడా దోస్త్ మోడల్ వాహనంలో కొత్తగా 'బడా దోస్త్' ఐ1, ఐ2 లిమిటెడ్ ఎడిషన్‌లను సోమవారం విడుదల చేసింది. అంతేకాకుండా రాబోయే ఆరు నెలల్లో సంస్థ అనుబంధ స్విచ్ మొబిలిటీ నుంచి సాంప్రదాయ ఇంధన వాహనాలకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ, ఎల్ఎన్‌జీ, హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తెచ్చేందుకు పని చేస్తున్నట్టు అశోక్ లేలండ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ధీరజ్ హిందూజా అన్నారు. త్వరలో స్విచ్ బ్రాండ్ ద్వారా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహానాలను తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం కంపెనీకి చెందిన లైట్ కమర్షియల్ వాహనాలు ప్రపంచ మొత్తం కమర్షియల్ మార్కెట్లో 70 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో తాము కొత్త వాహనాల ద్వారా ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేసే లక్ష్యాన్ని నిర్దేశించామని, భవిష్యత్తులో గ్లోబల్ కమర్షియల్ వాహనాల్లో టాప్-10 జాబితాలో ఉండాలని భావిస్తున్నామని ధీరజ్ హిందూజా పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వినియోగదారుల వాహన ఆసక్తులను గమనిస్తున్నాం. చిన్న ట్రక్కులకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ వాహనాల వాడకం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. లిమిటెడ్ ఎడిషన్‌గా తెచ్చిన బడా దోస్త్ ఐ1, ఐ2 మోడళ్లు ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా ఉంటాయని, మెరుగైన సౌకర్యాలతో పాటు అధిక బరువు మోగల సామర్థ్యం వీటికి ఉంది. సంస్థ బడా దోస్ట్ మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా లిమిటెడ్ ఎడిషన్‌లను తీసుకొచ్చినట్టు ఆయన వెల్లడించారు.



Next Story