తొమ్మిదేళ్లలో 50 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం!

by Disha Web Desk 13 |
తొమ్మిదేళ్లలో 50 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం!
X

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల పెంపు కోసం కేంద్రం చేసిన ప్రయత్నాలలో భాగంగా తొమ్మిదేళ్లలో 50,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్టు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. గణాంకాల ప్రకారం, 2014-15లో దేశంలో మొత్తం 97,830 కిలోమీటర్ల పొడవు జాతీయ రహదారులు ఉండేవి. ఈ ఏడాది మార్చి నాటికి అది 1,45,155 కిలోమీటర్లకు పెరగడం గమనార్హం. అధికారిక సమాచారం ప్రకారం 2014-15లో రోజుకు 12.1 కి.మీ చొప్పున రోడ్లు నిర్మించగా, 2021-22లో ప్రతిరోజూ 28.6 కి.మీకు పెరిగింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు ఇచ్చిన ప్రాధాన్యతే దీనికి కారణమని నివేదికలు చెబుతున్నాయి.

పలు నివేదికల ప్రకారం, 63.73 లక్షల కిలోమీటర్ల అత్యంత పొడవైన రోడ్ నెట్‌వర్క్‌తో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్‌లో ఇప్పటికీ 85 శాతం మంది రోడ్డు మార్గంలోనే ప్రయాణిస్తున్నారు. సరుకు రవాణా సైతం 70 శాతం రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం జాతీయ రహదారులను మరింత విస్తరిస్తూ తొమ్మిదేళ్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించింది. భారత్‌మాల ద్వారా దేశంలో అతిపెద్ద ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తోంది.


Next Story