Spam: స్పామ్ కాల్స్, మెసేజ్‌లను గుర్తించేందుకు ఎయిర్‌టెల్ కొత్త ఏఐ ఫిల్టర్

by S Gopi |

ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ పరిధిలో ప్రతిరోజూ దాదాపు 10 లక్షల స్పామర్లను విజయవంతంగా కనిపెట్టామని వివరించింది.

Spam: స్పామ్ కాల్స్, మెసేజ్‌లను గుర్తించేందుకు ఎయిర్‌టెల్ కొత్త ఏఐ ఫిల్టర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో డిజిటల్ లావాదేవీలు, చెల్లింపులు వేగవంతంగా పెరిగిన నేపథ్యంలో అదే స్థాయిలో స్పామ్ మోసాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. వీటిని అరికట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. దీనికి సంబంధించి టెలికాం కంపెనీలకు సైతం వివిధ మార్గదర్శకాలను నిర్దేశించింది. తాజాగా ప్రైవేట్ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) ఆధారిత స్పామ్ ఫిల్టర్ తీసుకొచ్చింది. దీన్ని ప్రారంభించిన రెండున్నర నెలల్లో 800 కోట్ల స్పామ్ కాల్స్, 80 కోట్ల స్పామ్ ఎస్ఎంఎస్‌లను గుర్తించినట్టు ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ పరిధిలో ప్రతిరోజూ దాదాపు 10 లక్షల స్పామర్లను విజయవంతంగా కనిపెట్టామని, ఇవి మొత్తం కాల్స్‌లో 6 శాతానికి, మొత్తం ఎస్ఎంఎస్‌లలో 2 శాతానికి సమానమని కంపెనీ వివరించింది. సెప్టెంబర్ చివరి వారంలో ఎయిర్‌టెల్ తన నెట్‌వర్క్ కోసం స్పామ్ ఫిల్టర్‌ను మొట్టమొదటిసారిగా ప్రారంభించింది. అప్పటినుంచి స్పామ్ కాల్స్ గురించి 25.2 కోట్ల కస్టమర్లకు తెలియజేశామని, దీనివల్ల 12 శాతం వరకు స్పామ్‌లను కట్టడి చేయగలిగినట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది. అయితే, స్పామర్లలో 35 శాతం మంది ల్యాండ్‌లైన్ టెలిఫోన్‌ల నుంచే ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు ఎయిర్‌టెల్ ఫిల్టర్‌లో బయటపడింది. అత్యధికంగా స్పామ్ కాల్స్, మెసేజ్‌లను ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటిస్థానంలో ఉండగా, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, వెస్ట్ యూపీ, కర్ణాటక ఉన్నాయి.

Next Story