విమాన టిక్కెట్ల ధరలు పెరగకుండా చూసుకోవాలి: విమానయాన మంత్రిత్వ శాఖ

by Disha Web Desk 17 |
విమాన టిక్కెట్ల ధరలు పెరగకుండా చూసుకోవాలి: విమానయాన మంత్రిత్వ శాఖ
X

న్యూఢిల్లీ: గో ఫస్ట్ విమానయాన సంస్థ సంక్షోభం కారణంగా కొన్ని ప్రధాన మార్గాల్లో విమాన ఛార్జీలు వేగంగా పెరుగుతున్నాయని, కాబట్టి వాటిని కట్టడి చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ విమానయాన సంస్థలను కోరింది. దివాళా పరిష్కార ప్రక్రియలో ఉన్న గో ఫస్ట్, మే 3 నుండి విమానాలను నిలిపివేసింది. దీంతో గో ఫస్ట్ ప్రయాణించే ప్రధానమైన రూట్లలో టిక్కెట్ల ధరలు ఈ మధ్య కాలంలో పెరగడం గుర్తించినట్లు విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. టిక్కెట్ల గరిష్ట పరిమితి చాలా ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలని కేంద్రం విమానయాన సంస్థలను కోరింది.

వేసవి సెలవుల కారణంగా దేశవ్యాప్తంగా విమాన ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్-జూన్ కాలాన్ని విమానయాన సంస్థలకు పీక్ సీజన్‌గా పరిగణిస్తారు. కాబట్టి ఇలాంటి సమయంలో టిక్కెట్ల ధరల విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని, ధరలు గరిష్ట పరిమితికి లోబడి ఉండాలని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇటీవల కాలంలో గో ఫస్ట్ మే 26 వరకు విమానాలను రద్దు చేసింది. అలాగే, ఇండిగో కు చెందిన అనేక విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజిన్ సమస్యల కారణంగా నిలిచిపోయాయి. విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

Also Read..

Demonetisation 2.0 :ట్యాక్స్ కలెక్షన్‌పై రూ.2 వేల నోటు ఎఫెక్ట్

Next Story