- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Air India: ఎయిరిండియాకు షాక్.. సీఈవో క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా!
పదవీ కాలం ముగియక ముందే ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

దిశ, వెబ్డెస్క్: ప్రముఖ ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను దక్కించుకున్న తర్వాత సంస్థను గాడిలో పెట్టడంలో కీలక పాత్ర పోషించిన విల్సన్, తన ఐదేళ్ల పదవీ కాలం ముగియక ముందే తప్పుకోవడం విమానయాన రంగంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, విల్సన్ రాజీనామా చేసినప్పటికీ, కొత్త సీఈవో బాధ్యతలు స్వీకరించే వరకు విల్సన్ తన విధుల్లో కొనసాగనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 2026 వరకు ఆయన నోటీసు పీరియడ్లో ఉండే అవకాశం ఉంది.
కాగా, 2022లో బాధ్యతలు చేపట్టిన విల్సన్ పదవీ కాలం జూలై 2027 వరకు ఉంది. అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా ఏడాదిన్నర ముందే ఆయన తప్పుకుంటున్నట్లుగా సమాచారం. ఎయిరిండియా బోర్డు ఇప్పటికే ఆయన రాజీనామాను ఆమోదించింది. ఎయిరిండియాను ఆధునీకరించడానికి ఆయన ‘విహాన్.AI’ (Vihaan.AI) అనే ఐదేళ్ల ప్రణాళికను ప్రవేశపెట్టారు. సుమారు 470 కొత్త విమానాల కోసం చారిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవడంలోనూ, విస్తారా (Vistara) విలీన ప్రక్రియలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. రాజీనామాకు అధికారికంగా వ్యక్తిగత కారణాలు అని చెబుతున్నప్పటికీ, గత ఏడాది అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం, సంస్థ ఎదుర్కొంటున్న సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బోర్డు కొత్త నాయకత్వం కోసం చూస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాటా గ్రూప్ ఇప్పటికే కొత్త సీఈవో కోసం వెతుకులాట ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.






