IT Industry: టెక్ ఉద్యోగాలకు ఏఐ బెడద

by S Gopi |   (  Updated:2025-07-29 14:12:19  IST  )

భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఐటీ రంగంలో మరిన్ని కోతలకు దారితీయవచ్చని సందేహిస్తున్నారు.

IT Industry: టెక్ ఉద్యోగాలకు ఏఐ బెడద
X

దిశ, బిజినెస్ బ్యూరో: టెక్ రంగంలోని ఉద్యోగులలో భయం మొదలైంది. ఇటీవల ఐటీ సేవల దిగ్గజం టీసీఎస్ భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపులను ప్రకటించడమే ఇందుకు కారణం. టీసీఎస్ ఈ తొలగింపులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) కారణం కాదని, 'స్కిల్స్ మిస్‌మ్యాచ్' మాత్రమేనని చెప్పినప్పటికీ, అన్ని రంగాలలో ఉద్యోగాలకు ఏఐ ముప్పు ఉందనే అనుమానాలు పెరిగాయి. పరిశ్రమ విశ్లేషకుల ప్రకారం, టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీయే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఇతర కంపెనీలు సైతం దాన్ని అనుసరించే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఐటీ రంగంలో మరిన్ని కోతలకు దారితీయవచ్చని సందేహిస్తున్నారు. ఈ క్రమంలోనే, భారత ఐటీ రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమ సంస్థ నాస్కామ్ ప్రకారం, టీసీఎస్ తొలగింపులు 'వర్క్‌ఫోర్స్ రేషనలైజేషన్ (శ్రామిక శక్తి హేతుబద్ధీకరణ)' ధోరణికి సంకేతమని, కంపెనీలు ఏఐ-ఆధారిత మోడళ్ల వైపు మొగ్గు చూపుతున్నాయని అభిప్రాయపడింది.

భవిష్యత్తులో ప్రభావితం చేసే అంశాలు

*వర్క్‌ఫోర్స్ రేషనలైజేషన్: సంస్థలు ఐటీ పరిశ్రమ వృద్ధి, ఆవిష్కరణ, వేగం కోసం క్లయింట్ డిమాండ్లను తీర్చేందుకు అవసరమైన మోడళ్లకు మారుతున్నాయి. ఫలితంగా సమీప భవిష్యత్తులో కొన్ని మార్పులను స్వీకరించేందుకు వర్క్‌ఫోర్స్ రేషనలైజేషన్ తప్పదని నాస్కామ్ భావిస్తోంది.

* ఏఐ, ఆటోమేషన్ ప్రభావం: ఏఐ, ఆటోమేషన్ వ్యాపార కార్యకలాపాలకు కేంద్రంగా మారడంతో, ఐటీ పరిశ్రమ కీలక మలుపులో ఉంది. ఈ మార్పు సాంప్రదాయ సేవల డెలివరీ ఫ్రేమ్‌వర్క్‌లను పునర్నిర్మించే అవకాశం ఉంది. సాంప్రదాయ నైపుణ్యాలను తిరిగి సమీక్షిస్తున్నందున ఈ ధోరణి కనిపిస్తోంది.

* స్కిల్స్, స్కిల్స్ అప్‌గ్రేడ్: భవిష్యత్తులో టెక్నాలజీ మార్పు నేపథ్యంలో అందుకు సిద్ధంగా ఉండటం, స్థిరంగా స్కిల్స్ పెంచుకునే అలవాటు, క్రాస్-స్కిల్లింగ్ ఉద్యోగులకు చాలా ముఖ్యం. నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి. ఏఐ యుగంలో భారత టెక్ లీడర్‌షిప్‌గా కొనసాగేందుకు పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం మధ్య సహకారం అవసరం ఉందని నాస్కామ్ పేర్కొంది.

* పరిశ్రమ ధోరణి: స్థూల ఆర్థిక ఒత్తిళ్లు, మారుతున్న క్లయింట్ అంచనాలు, కొత్త సాంకేతికతల స్వీకరణ కారణంగా మరింత సమర్థవంతమైన, పనితీరు-కేంద్రీకృత ఉద్యోగుల అవసరం ఐటీ పరిశ్రమకు ఉంది. ఇలాంటి పరిణామాల మధ్య తాజా తొలగింపులు, ఇతర చర్యలు తప్పవని నాస్కామ్ వెల్లడించింది.

ఉద్యోగులపై ప్రభావం

* ప్రమాదంలో ఉద్యోగ భద్రత: టీసీఎస్ లేఆఫ్స్ నిర్ణయం ఐటీ పరిశ్రమలోని ఉద్యోగులలో ఉద్యోగ అభద్రతను పెంచాయి. ఏఐ, ఆటోమేషన్ కారణంగా వారి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయా అని చాలామంది ఆలోచిస్తున్నారు.

* స్కిల్స్ అప్‌గ్రేడ్: ఏఐ, క్లౌడ్-ఆధారిత సాంకేతికతలు, అప్లయిడ్ ఇంటిలిజెన్స్ వంటి అంశాల్లో స్కిల్స్ అభివృద్ధి చేయడంపై దృష్టి సారించడం తప్పనిసరి. పరిశ్రమలో కొనసాగాలంటే ఉద్యోగులు తమ స్కిల్స్, రీస్కిల్స్ పెంచుకోవాలి.

* మారుతున్న ఉద్యోగ మార్కెట్: డీప్, ప్రత్యేక నైపుణ్యం కోసం పెరుగుతున్న డిమాండ్ వల్ల జాబ్ మార్కెట్ మరింత అడ్వాన్స్‌గా ఉండనుంది.

ఐటీ భవిష్యత్తు

* ఏఐ-ఆధారిత కార్యకలాపాలు: సామర్థ్యం, ఇన్నోవేషన్‌ను మెరుగుపరచడానికి కంపెనీలు ఏఐ, ఆటోమేషన్‌కు మారుతుండటంతో ఐటీ పరిశ్రమ మరింత ఏఐ-ఆధారిత రంగంగా మారుతుందని భావిస్తున్నారు.

* కొత్త ఉద్యోగ అవకాశాలు: ఏఐ కొన్ని ఉద్యోగాలను ప్రభావితం చేసినప్పటికీ, ఇది ఏఐ అభివృద్ధి, విస్తరణ, నిర్వహణ వంటి రంగాలలో కొత్త అవకాశాలు లభించనున్నాయి.

* విద్యారంగ సహకారం: నైపుణ్య అంతరాన్ని తగ్గించడానికి, ఏఐ యుగంలో భారత్‌ను టెక్ లీడర్‌షిప్‌ స్థానంలో నిలబెట్టడానికి పరిశ్రమ, విద్యారంగం, ప్రభుత్వం మధ్య సహకారం అవసరం ఉందని నాస్కామ్ వెల్లడించింది.

Next Story