రూ. 7,374 కోట్ల ముందస్తు రుణాలను చెల్లించిన అదానీ గ్రూప్!

by Disha Web Desk 17 |
రూ. 7,374 కోట్ల ముందస్తు రుణాలను చెల్లించిన అదానీ గ్రూప్!
X

ముంబై: హిండెన్‌బర్గ్ నివేదిక కారణంగా మసకబారిన పేరును తిరిగి సాధించేందుకు అదానీ గ్రూప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే సంస్థ మార్కెట్ విలువ రూ. లక్షల కోట్లు కోల్పోయిన నేపథ్యంలో మదుపర్లు, నియంత్రణ సంస్థల విశ్వాసం కోసం అదానీ గ్రూప్ కొన్ని రుణాలను ముందుగా చెల్లిస్తోంది. అందులో భాగంగా తాజాగా పలు అంతర్జాతీయ బ్యాంకులు, దేశీయ ఆర్థిక సంస్థలకు రూ. 7,374 కోట్ల రుణాలను ముందుగా చెల్లించామని అదానీ గ్రూప్ మంగళవారం ప్రకటనలో వెల్లడించింది.

ఈ చెల్లింపులకు 2025 వరకు గడువు ఉన్నప్పటికీ రుణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ప్రమోటర్లకు ఇచ్చిన హామీ ప్రకారం చెల్లింపులు పూర్తి చేసినట్లు కంపెనీ వివరించింది. ఈ చెల్లింపుల ద్వారా అదానీ పోర్ట్స్‌కు చెందిన 11.8 శాతం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ కు చెందిన 4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 1.2 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌కు చెందిన 4.5 శాతం షేర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి కంపెనీకి చెందనున్నాయి.

ఫిబ్రవరిలో సైతం అదానీ సంస్థ 1.11 బిలియన్ డాలర్ల(రూ. 9 వేల కోట్లకు పైగా) విలువైన రుణాలను చెల్లించిన సంగతి తెలిసిందే. కాగా, 2022, సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూప్ కంపెనీల నికర రుణ మొత్తం రూ. 24.1 బిలియన్ డాలర్లు(రూ. 1.97 లక్షల కోట్లు)గా ఉందని సమాచారం.



Next Story