Diesel Blend: ఈ20 పెట్రోల్ తర్వాత ఇప్పుడు డీజిల్ వంతు

by S Gopi |

ఇథనాల్‌ను డీజిల్‌తో నేరుగా కలపడం సాంకేతికంగా సాధ్యం కాకపోవడంతో, ఇథనాల్ నుంచే ఐసోబ్యూటనాల్‌ను తయారు చేసి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే మార్గాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు.

Diesel Blend: ఈ20 పెట్రోల్ తర్వాత ఇప్పుడు డీజిల్ వంతు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను కలిపిన ఫార్ములాతో డీజిల్‌లోనూ సరికొత్త విప్లవానికి కేంద్రం తెరలేపనుంది. విదేశాల నుంచి వచ్చే చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో, ఇకపై డీజిల్‌లో 15 శాతం వరకు ‘ఐసోబ్యూటనాల్’ అనే ప్రత్యామ్నాయ ఇంధనాన్ని కలపడానికి రోడ్‌మ్యాప్ సిద్ధం చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఇథనాల్‌ను డీజిల్‌తో నేరుగా కలపడం సాంకేతికంగా సాధ్యం కాకపోవడంతో, ఇథనాల్ నుంచే ఐసోబ్యూటనాల్‌ను తయారు చేసి ప్రత్యామ్నాయ ఇంధనంగా ఉపయోగించే మార్గాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందన్నారు. ఇప్పటికే 100 శాతం ఇథనాల్, 100 శాతం ఐసోబ్యూటనాల్‌తో రెండు జనరేటర్ సెట్లను విజయవంతంగా నడిపామని, దీంతో ఈ ఇంధనాలకు అనుగుణంగా ఇంజిన్‌లను రూపొందించడం సాధ్యమేనని నిరూపితమైందని గడ్కరీ చెప్పారు. అధిక శక్తి సామర్థ్యం, మెరుగైన ఇంజిన్ అనుకూలత, తక్కువ కాలుష్య ఉద్గారాలు వంటి లక్షణాల వల్ల ఐసోబ్యూటనాల్‌ను తదుపరి తరం బయోఫ్యూయల్‌గా ప్రభుత్వం చూస్తోంది.

భారత్ శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, విదేశీ మారకద్రవ్య వ్యయాన్ని నియంత్రించడం, దేశీయ బయోఫ్యూయల్ ఉత్పత్తికి డిమాండ్ పెంచడం ఈ వ్యూహం వెనుక ప్రధాన లక్ష్యాలు. ఇదే సమయంలో ఈ20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇథనాల్ వల్ల ఇంజిన్‌లు దెబ్బతింటాయన్నా, బీమా లేదా వారంటీలు చెల్లవన్నా, నీటి వినియోగం అధికమవుతుందన్న ప్రచారానికి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పుడు డీజిల్‌లో ఐసోబ్యూటనాల్ వినియోగం ప్రారంభమైతే, దేశ బయోఫ్యూయల్ విధానంలో అది మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

Next Story