ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం

by Dishanational1 |
ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా తగ్గించే ప్రయత్నాల్లో ప్రభుత్వం
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సెబీ కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ వాటాను 75 శాతం కంటే దిగువకు తగ్గించాలని యోచిస్తున్నట్టు ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. 2023, మార్చి 31 నాటికి మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నాలుగు మాత్రమే కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్(ఎంపీఎస్) నిబంధనలను పాటిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో మూడు ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) ఇందుకు సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన ఐదింటిలో నిబంధనలకు అనుగుణంగా వాటా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివేక్ జోషి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ప్రభుత్వానికి 98.25 శాతం వాటా ఉంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 96.38 శాతం, యూకో బ్యాంకులో 95.39 శాతం, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93.08 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 86.46 శాతం ఉంది. సెబీ నిబంధనల ప్రకారం అన్ని లిస్టెడ్ కంపెనీలు తప్పనిసరిగా 25 శాతం ఎంపీఎస్‌ను నిర్వహించాలి. అయితే, గతంలో సెబీ పీఎస్‌బీలకు ఈ ఏడాది ఆగష్టు వరకు గడువు ఇచ్చింది. పబ్లిక్ ఆఫర్ లేదా క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా వాటా తగ్గించుకోవడానికి బ్యాంకులకు వివిధ అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని వివేక్ జోషి పేర్కొన్నారు.

Next Story

Most Viewed