- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anil Ambani: అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ కార్యకలాపాలపై సీబీఐ దాడులు
సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్కు చెందిన పలు కంపెనీలపై సీబీఐ దర్యాప్తు మరింత వేగం అందుకుంది. రిలయన్స్ టెలికాం, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ సంస్థలకు సంబంధించిన మూడు కేసుల్లో భాగంగా, ముంబైలోని 17 ప్రాంతాల్లో శనివారం సోదాలు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. కంపెనీల డైరెక్టర్ల నివాసాలతో పాటు, బ్యాంకు నిధులను మళ్లించడానికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న మధ్యవర్తిత్వ కంపెనీల కార్యాలయాలపై కూడా ఈ దాడులు జరిగాయి. సీబీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముంబై ప్రత్యేక కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ల ఆధారంగా ఈ సోదాలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒకే చిరునామా నుంచి అనేక మధ్యవర్తిత్వం వహించిన కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని సీబీఐ పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్ఐసీ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, గత కొన్ని నెలల్లో అనిల్ అంబానీ గ్రూప్పై మొత్తం ఏడు కేసులు నమోదు కాగా, ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం నష్టం రూ.27,337 కోట్లుగా అంచనా. ఇప్పటికే రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు అరెస్టు కావడం ఈ కేసుకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గ్రూప్ బ్యాంకింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించిన జాయింట్ ప్రెసిడెంట్ డి. విశ్వనాథ్, అలాగే వైస్ ప్రెసిడెంట్ అనిల్ కల్యాలను ఏప్రిల్లో సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అనిల్ అంబానీ గ్రూప్కు సంబంధించిన ఈ కేసుల దర్యాప్తును సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోందని సీబీఐ వెల్లడించింది.






