మోనోలిత్ మిస్సింగ్..

by  |
మోనోలిత్ మిస్సింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కొద్ది రోజుల క్రితం అమెరికాలోని ఉటా ఎడారిలో ‘మోనోలిత్’ లాంటి వస్తువు ప్రత్యక్షమైందన్న వార్త.. ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించింది. అక్కడికి ఏదైనా వస్తువు తీసుకురావాలన్నా, అక్కడే వదిలేయాలన్నా అధికారుల అనుమతి తప్పనిసరి, అలాంటి పరిస్థితుల్లో ఆ మోనోలిత్ ఎలా వచ్చిందని? అధికారులు ఆరా తీస్తున్నారు. అది ఎప్పటి నుంచి అక్కడ ఉంది? దాన్ని ఎవరు తయారుచేసుంటారు, తొలగించడం సాధ్యమేనా లాంటి విషయాలపై పరిశోధనలు చేస్తున్న సమయంలో ఆ మోనోలిత్ ఇప్పుడు కనిపించకుండా పోయింది. శుక్రవారం సాయంత్రం తర్వాత ఆ స్తంభం కనిపించట్లేదని ఉటాకు చెందిన బ్యూరో ఆఫ్‌ ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ (BLM) అధికారులు తెలిపారు. దాంతో నెటిజన్లు ఇది తప్పనిసరిగా ఏలియన్స్ చేసిన పనే అంటున్నారు. మరోవైపు ఉటా అధికారుల నిర్లక్ష్యపు ధోరణిపైనా కామెంట్లు చేస్తున్నారు.

లోహపు దిమ్మె మిస్టరీని ఛేదిస్తామని అధికారులు తెలిపినప్పటికీ, మళ్లీ ఇప్పుడు అది కనిపించడం లేదని చెప్పడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. లోహపు దిమ్మె మీద పరిశోధనలు సాగిస్తున్నప్పుడు దాన్ని ఇతరులెవరు కూడా దొంగలించకుండా తగిన భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులకు లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అధికారులే ఆ దిమ్మెను తొలగించి ఉంటారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘లోహపు దిమ్మెను కొందరు వ్యక్తులు తీసుకెళ్లినట్లు మేం గుర్తించాం. దిమ్మెను తొలగించినట్లు మా దగ్గర కచ్చితమైన సమాచారం ఉంది’ అని ల్యాండ్‌ మేనేజ్‌మెంట్‌ బ్యూరో అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఎవరు దాన్ని తొలగించారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఈ దిమ్మె ప్రత్యక్షమైన నాటి నుంచి, దీని గురించి ప్రజల్లో ఆసక్తి పెరిగింది. కానీ ఉటా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సేఫ్టీ వాళ్లు ఆ ప్రదేశం ఎక్కడో ఉందో స్పష్టంగా తెలియజేయలేదు. ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో సీక్రెసీ మెయింటైన్ చేశారు. అయితే దిమ్మె హఠాత్తుగా ప్రత్యక్షం కావడం, మళ్లీ అంతే సడన్‌గా మాయమవడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్పేస్ ఒడిస్సీ సినిమాలో అది కనిపించిన ప్రతిసారీ ప్రపంచం ఎలాగైతే అభివృద్ధి వైపు పయనిస్తుందో.. అలాగే 2020లో జరిగిన నష్టానికి 2021 శుభముహుర్తంగా నిలవనుందని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed