జగిత్యాలలో దారుణం : భూములిచ్చి.. మళ్లీ గుంజుకున్న ప్రభుత్వం

by  |
buggaram
X

దిశ, కరీంనగర్ సిటీ : జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో అధికారుల వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. పేదలకు ఇచ్చిన భూమిలో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టాదారులను బలవంతంగా ఖాళీ చేయించడం పట్ల ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. వారికి మద్దతుగా నిలుస్తున్న రాజకీయ నేతలపై కూడా అధికార యంత్రాంగం పోలీసులకు ఫిర్యాదు చేయడంపై పలు పార్టీల నాయకులు మండిపడుతున్నారు. బుగ్గారం గ్రామంలోని 516 సర్వేనెంబర్‌లో నగునూరి సంధ్య, శ్రావణి, జ్యోతి కుటుంబాలకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం సాగు భూమి ఇచ్చింది.

పట్టాదారు పాసు పుస్తకంతో పాటు రైతు బంధు కూడా అమలవుతున్న ఈ భూమిలో కొద్దీ రోజుల కిందట నగర పంచాయతీ పాలకవర్గం పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండగా దీనిని అడ్డుకున్న పట్టాదారులు ఆ భూమిలోనే గుడారాలు వేసుకుని నివసిస్తున్నారు. ఇటీవల రాఖీ పౌర్ణమి పండుగ కూడా అందులోనే జరుపుకున్నారు. అయినా, వెనక్కితగ్గని అధికారులు బుధవారం పోలీసులతో అక్కడికి చేరుకుని, ఆ భూమిలో నివసిస్తున్న పట్టాదారులను బలవంతంగా ఖాళీ చేయించారు. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అక్కడికి చేరుకుని బాధితులకు మద్దతుగా నిలిచి, ఆందోళనకు దిగారు.

రోడ్డుపై బైఠాయించి అధికారులు, పాలకవర్గ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, వీరిని కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించడం పట్ల స్థానిక రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నాయి. అధికార నేతల అండదండలతోనే ఈ తతంగమంతా నడుస్తుందని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. సర్కారు ఇచ్చిన భూమిని లాక్కొమ్మని ముఖ్యమంత్రి చెప్పారా? టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందా? బహిర్గతం చేయాలంటూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఈ మొత్తం వ్యవహారమంతా మంత్రి కొప్పుల ఈశ్వర్, కలెక్టర్ కలిసే నడుపుతున్నారంటూ మండిపడ్డారు. లబ్దిదారుల భూములు లాక్కున్నట్టైతే, ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.



Next Story

Most Viewed