బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించలేదు.. ఆధారాలు ఉన్నాయి: బుగ్గన

by  |
బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించలేదు.. ఆధారాలు ఉన్నాయి: బుగ్గన
X

దిశ, ఏపీబ్యూరో: టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌పై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసరమైన అనుమానాలను ప్రజల్లో రేకెత్తించేలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. ఆడిట్ చేసే సమయంలో పలు రకాల ప్రశ్నలు వేయడం సహజమని.. ఆ ప్రశ్నలనే ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే సమావేశమై పరిష్కరించుకోవాలే తప్ప గవర్నర్‌కు లేఖలు రాయడం, మీడియా సమావేశాలను నిర్వహించడం ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటని నిలదీశారు.

విజయవాడలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన బిల్లులు లేకుండానే డబ్బులు చెల్లించారనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. రూ. 41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. వేల కోట్ల అవకతవకలు జరిగితే సంబంధిత వ్యవస్థలు చూసుకోకుండా ఉంటాయా? అని ఎదురుదాడికి దిగారు. రూ. 41 వేల కోట్ల బిల్లుల చెల్లింపులపై ఆడిట్ సంస్థ వివరణ కోరిందని… అన్ని వివరాలను ఏజీ కార్యాలయానికి అందిస్తామని వివరణ ఇచ్చారు. ఈ గందరగోళానికి సీఎఫ్ఎంఎస్ వ్యవస్థే కారణమని బుగ్గన ఆరోపించారు. ఈ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడంతో పెద్ద సమస్యగా మారిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు.

Next Story