బడ్జెట్‌లో సంక్షేమానికి కోత

by  |
బడ్జెట్‌లో సంక్షేమానికి కోత
X

దిశ, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం 2020-21 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కోత పెట్టింది. సంక్షేమానికి పెద్దపీట వేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తన ప్రసంగంలో చెప్పారు. కానీ, సాంఘీక సంక్షేమ గురుకులాలకు రూ.2 కోట్లు, ఎస్సీవిద్యార్థుల హాస్టళ్లకు రూ.1.76 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను(ఎస్సీ డెవలెప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి) అందజేసేందుకు రూ.71 లక్షలను, కులాంతర వివాహాలు చేసుకునేవారికి అందించే ప్రోత్సాహాకాలలో నిధులు కేటాయింపులో గతేడాది కంటే కోత విధించింది. ఎస్సీలకు రూ.16,534.97 కోట్లను, ఎస్టీలకు రూ.9,771.28 కోట్లను ప్రభుత్వం కేటాయించినట్టు హరీష్ రావు వివరించారు. ఈ వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీల నిధులను ఎస్సీ, ఎస్టీలకే ఖర్చు చేసేలా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని తెచ్చామన్నారు.

కుల వృత్తులకు మొండి చేయి..

బీసీ సామాజిక వర్గంలోని వివిధ కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ప్రారంభంలో ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం బాగానే అందినా.. రానురాను నిరాదరణకు గురవుతున్నాయి. 2018-19 సంవత్సరంలో వివిధ సామాజిక తరగతుల సహకార సంస్థలకు నిధులు కేటాయించిన ప్రభుత్వం గడిచిన రెండేళ్ళుగా నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపుతోంది. గతేడాది, ఈ ఏడాది ఒక్క పైసా కూడా కేటాయింపులు చేయకపో్వడం గమనార్హం. మొత్తం బీసీలకు ఈ బడ్జెట్‌లో రూ.4,356 కోట్లను కేటాయించింది. గతేడాది ఎంబీసీలకు రూ.5 కోట్లను మాత్రమే కేటాయించిన ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి రూ.500 కోట్లను కేటాయించింది. చేనేతకారులకు సహాయక గ్రాంటు కింద రూ.338 కోట్లను కేటాయించారు. సంచార తెగల అభివృద్దికి మాత్రం 2019-20‌లో రూ.28 లక్షలు కేటాయించి, ఈ సంవత్సరం కేవలం రూ.2.81 లక్షలు మాత్రమే కేటాయించారు. మైనార్టీలకు రూ.1518 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. వచ్చే సంవత్సరం నుంచి 71 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలలను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

tags: Budget, Sc, St, Bc, Minority Welfare

Next Story

Most Viewed