అమ్మ నాన్నను బాధ పెట్టలేక.. విషాదం నింపిన కూతురు

by  |
అమ్మ నాన్నను బాధ పెట్టలేక.. విషాదం నింపిన కూతురు
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్/ వనపర్తి: అమ్మ నాన్న.. ఇక నేను చదవలేను.. నా ఫీజుల కోసం మీరు పడుతున్న కష్టాలు భరించలేకపోతున్నా.. ఇక నేను మీ నుంచి దూరంగా వెళ్లిపోతున్నా.. అంటూ తన సెల్ ఫోన్‌లో వీడియో తీసి ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం వనపర్తి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా కేంద్రంలోని ద్వారా పోగు వెంకటయ్య, ఈశ్వరమ్మ దంపతులకు కూతురు లావణ్య(19), కుమారుడు ఉన్నారు. కూతురు లావణ్య పాలిటెక్నిక్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌ శివారులోని ఘట్కేసర్‌లో ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఇందుకు సంబంధించి కళాశాలకు మంగళవారంలోపు రూ. 10 వేల ఫీజు చెల్లించాల్సి ఉంది. ఫీజు విషయం గత కొన్ని రోజుల నుంచి లావణ్య.. తల్లిదండ్రులకు చెప్తూ వచ్చింది.

ఈ క్రమంలో తల్లిదండ్రులు తెలిసిన వారిని అడిగి రూ. 8500 రూపాయలు సమకూర్చారు. మిగతా పదిహేను వందలు దొరకకపోవడంతో తెలిసిన వారిని అడగడం, వారు లేవని చెప్పడం, తన చదువు కోసం తన తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా చూసిన లావణ్య తన వల్లే తల్లిదండ్రులు అప్పులపాలై ఇబ్బందులు పడుతున్నారని భావించింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, సోదరుడు పనుల కోసం బయటకు వెళ్లడంతో ఇంట్లో ఉన్న లావణ్య మానసిక వేదనతో తాను ఇక బతకలేనని, నా చదువుల కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను అని కన్నీరు కారుస్తూ ఇంట్లో ఉరి వేసుకొని ప్రాణాలు వదిలింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూసేసరికి కూతురు ఉరి వేసుకుని ఉండటం గమనించి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story