భద్రాచలంలో ఇంటింటికి వెళ్లి ఏనుగును పరిచయం చేస్తున్నారు

by  |
BSP-1
X

దిశ, భద్రాచలం: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రెండేళ్లు గడువు ఉంది.‌ ఈసారి ముందస్తు ఎన్నికల ముచ్చటేలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పడంతో ఇంకా బోలెడు సమయం ఉన్నట్లుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. దీంతో ఓ విధంగా రాజకీయ నిస్తేజం నెలకొందని చెప్పవచ్చు. కానీ.. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రం ప్రజల్లోకి వెళ్లి పటిష్టంగా బలపడేందుకు రెండేళ్ల సమయం చాలదని భావిస్తోంది. బహుజనుల ఓట్లు అధికంగా ఉన్న భద్రాచలం నియోజకవర్గంలో ఈసారి గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి సూచనలతో రాష్ట్ర కన్వినర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ (ఆర్‌ఎస్పీ) సారథ్యంలో జిల్లా ఇన్‌చార్జి నానమాద్రి కృష్ణార్జునరావు నాయకత్వంలో డివిజన్, మండల, గ్రామ కమిటీల నాయకులు అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

ఏనుగును పరిచయం చేస్తున్నారు

నానమాద్రి కృష్ణార్జునరావు ‘ఇంటింటికీ బీఎస్పీ’ ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. పార్టీ కేడర్ను వెంటబెట్టుకొని వాగులు, వంకలు దాటుకుంటూ అటవీప్రాంత మారుమూల గ్రామాలకు సైతం వెళ్లి బీఎస్పీ జెండాను, ఏనుగు గుర్తును పరిచయం చేస్తున్నారు.‌ ఇది మన బహుజనుల జెండా.. ఏనుగు మన గుర్తు అని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఊరూరా జెండాలు, బ్యానర్లు కడుతున్నారు. బీఎస్పీకి ఎందుకు ఓటు వేయాలో తన ప్రసంగం ద్వారా వివరిస్తున్నారు. ఇంతకాలం ఇతరులకు ఓట్లు వేసి సహాయపడ్డాం.. ఇపుడు మన ఓట్లు మన పార్టీ బీఎస్పీకే వేసుకొని బహుజన రాజ్యం స్థాపించుకుందామంటూ ఆయన ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆయన మాటలకు ఆకర్షితులవుతున్నారు.

బీఎస్పీ అభ్యర్థిగా కృష్ణార్జునరావు..?

వచ్చే ఎన్నికల్లో భద్రాచలం అసెంబ్లీ బరిలో బీఎస్పీ అభ్యర్థిగా నానమాద్రి కృష్ణార్జునరావు పోటీచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకే ఆయన ముందుచూపుతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నట్లుగా తేటతెల్లమవుతోంది. రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న ఆయనకు పార్టీ అధినాయకత్వం భద్రాచలం అసెంబ్లీ గెలుపు బాధ్యత అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయన దుమ్మగూడెం, చర్ల మండలాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గ్రామాల సందర్శన సందర్భంగా‌ సమస్యలు తెలుసుకొని ప్రజాపోరాటాలకు రూపకల్పన చేస్తున్నారు.

ప్రణాళికలు రచిస్తున్నారు. గత, ప్రస్తుత పాలకుల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓటర్లను బీఎస్పీ వైపు ఆకర్షించేలా పక్కా వ్యూహంతో ఇంటింటికీ బీఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత వారంరోజులుగా ఈ కార్యక్రమం చర్ల మండలంలో కొనసాగుతోంది. ఉన్నత చదువులు చదివి, కీలకమైన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన కృష్ణార్జునరావుకి సామాజిక స్పృహ ఎక్కువ. అంతేగాక ఆయన స్థానికుడు (చర్ల) కావడంతో అసెంబ్లీ అభ్యర్థిగా ఆయనకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పరిచయ కార్యక్రమంలో దూసుకుపోతున్నారు.



Next Story