చైనా పరికరాలపై నిషేధం దిశగా బీఎస్ఎన్ఎల్!

by  |
చైనా పరికరాలపై నిషేధం దిశగా బీఎస్ఎన్ఎల్!
X

ముంబయి: ఇండియా, చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. 4జీ అప్‌గ్రేడ్ అంశంలో చైనా పరికరాల వాడకంపై నిషేధం దిశగా యోచిస్తున్నట్టు సమాచారం. వీటి పనుల్లో పాత టెండర్లను కూడా రద్దు చేసి రీటెండరింగ్‌కు వెళ్లాలని భావిస్తున్నది. బీఎస్ఎన్ఎల్ సహా ఎంటీఎన్ఎల్, అనుబంధ సంస్థలు కూడా ఇదే వ్యూహాన్ని అనుసరించడానికి సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. టెలికాం విభాగం మేడ్ ఇన్ చైనా పరికరాలను తగ్గించాలని, ఇటీవల కేంద్రం నినదించిన ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా మేడ్ ఇన్ ఇండియా పరికరాలను ఉపయోగించాలని అన్ని సంస్థలకు ఆదేశాలివ్వనున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా, టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలను నివారించే విధానాలను తీసుకురానుంది. పాత టెండర్లను రద్దు చేసి నిబంధనలను మార్చేందుకు రాష్ట్రాల్లోని సర్వీస్ ప్రొవైడర్లను కోరనుంది. భద్రతా సమస్యలు ఉన్న చైనా పరికరాలను ఉపయోగించవద్దని బీఎస్‌ఎన్‌ఎల్‌కు సూచించాలని మంత్రిత్వశాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి టెండర్‌ను తిరిగి రూపొందించాలని మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపాయి. చైనా సంస్థలు తయారుచేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించేలా ప్రైవేట్ ఆపరేటర్లను కోరే విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. టెలికాం కంపెనీలు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తమ ప్రస్తుత నెట్‌వర్క్‌లలో హువావేతో కలిసి పనిచేస్తుండగా, బీఎస్ఎన్ఎల్ జెడ్‌టీఈతో పనిచేస్తున్నది. రాబోయే 5జీ నెట్‌వర్క్‌లో రిలయన్స్ జియోకు ఒక్క చైనా నెట్‌వర్క్ పరికరం కూడా ఉపయోగించమని ముఖేష్ అంబానీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చైనా పరికరాలను ఉపయోగించని ప్రపంచంలోని ఏకైక నెట్‌వర్క్ రిలయన్స్ జియో అని ఫిబ్రవరిలో ట్రంప్ వచ్చిన సమయంలో ముఖేష్ అంబానీ చెప్పారు. జియో ప్రస్తుతం తన 4జీ, 5జీ నెట్‌వర్కుల్లో దక్షిణకొరియాకు చెందిన శామ్‌సంగ్‌తో కలిసి పనిచేస్తున్నది. చైనా కంపెనీలు తయారుచేసే పరికరాల భద్రత కూడా సందేహాస్పదంగా ఉంటుందని సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story

Most Viewed