ఒంటెలపై యోగాసనాలు.. బీఎస్‌ఎఫ్ జవాన్లపై విమర్శలు

by  |
ఒంటెలపై యోగాసనాలు.. బీఎస్‌ఎఫ్ జవాన్లపై విమర్శలు
X

దిశ, ఫీచర్స్ : అంతర్జాతీయ 7వ యోగా దినోత్సవం సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు యోగా ప్రాముఖ్యత గురించి వివరించారు. పలు యోగ ముద్రలతో కూడిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి జనాలకు అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాజస్థాన్, జోధ్‌పూర్‌లోని బీఎస్‌ఎఫ్ జవాన్ల ట్రైనింగ్ సెంటర్‌లో నేలపై పడుకొని ఉన్న ఒంటెలపై బీఎస్‌ఎఫ్ సిబ్బంది కూర్చోవడమే కాకుండా.. ఒంటెల వీపుపై జవాన్లు యోగాసనాలు వేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఈ ఇన్సిడెంట్‌పై స్పందించిన ఓమ్ తాన్వి అనే ట్విట్టర్ యూజర్(‘జనసత్తా’ మాజీ ఎడిటర్‌).. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ ‘క్రూరమైన యోగా! ఒంటె కాళ్లను కట్టేసి, నేలపై కార్పెట్‌లా పడిఉన్న దాని వీపుపై కూర్చుని ఫీట్ చేయడం యోగా అనిపించుకోదు. ఇది క్రూరత్వంతో కూడిన చర్య’ అంటూ పోస్ట్ చేశాడు. ఇక ఈ సంఘటన పట్ల మండిపడుతున్న నెటిజన్లు.. కఠిన చర్యల కోసం సంబంధిత అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మూగజీవులను ఈ విధంగా ట్రీట్ చేసిన నిర్వాహకులపై పీఎంఓ యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి మాట్లాడిన భారత ప్రధాని నరేంద్ర మోడీ.. కొవిడ్-19 విపత్కర పరిస్థితుల తర్వాత యోగా ఏ విధంగా కీలక శక్తిగా అవతరించిందో వివరించారు. ఇక ప్రతీ ఏట జూన్ 21న యోగా డే సెలబ్రేట్ చేస్తుండగా.. మనసును నిర్మలంగా ఉంచి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో సాయపడుతుందన్న విషయం తెలిసిందే.

Next Story

Most Viewed