బీఎస్4 వెహి‘కిల్’.. ఇగ కొత్త‘వే’!

by  |
బీఎస్4 వెహి‘కిల్’.. ఇగ కొత్త‘వే’!
X

దిశ, మేడ్చల్: ఇగ పాత ముచ్చటుండదు.. అంతా కొత్త ముచ్చటే. ఒకవేళ ఉన్నా కూడా అది లెక్కలోకి రాదు. అందుకే అటువైపే ఎక్కువ మొగ్గుంది. దీంతో అన్నీ కూడా కొంగొత్తగా మనముందుకు రానున్నాయి. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవండి.

త్వరలోనే భారత్‌ స్టేజ్‌ (బీఎస్‌) 6 వాహనాలు రోడ్డెక్కనున్నాయి. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి మొత్తం ఈ వాహనాలే రానున్నాయి. ఇక ఆ తేదీ నుంచి బీఎస్‌ 4 వాహనాలు రిజిస్ట్రేషన్లు చేయరు. బీఎస్‌ 6 బండ్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పటికే అనేక కంపెనీలు బీఎస్‌ 6 ప్రమాణాలు ఉన్న వాహనాలను తయారు చేసి మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం సిద్ధం చేస్తున్నాయి. బీఎస్‌-6 వాహనాలు అందుబాటులో ఉండడంతో వాహనదారులు వాటిపైనే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. కంపెనీలు బీఎస్‌-4 వాహనాల ఉత్పత్తి తగ్గించడంతో ఇటీవల వాహనాల అమ్మకాలు పడిపోవడానికి ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు.

తగ్గనున్న కాలుష్యం

బీఎస్‌-6 వాహనాల తయారీలో ఎగ్జాక్స్ట్‌(పొగ గొట్టం) కొత్త రకంగా తయారు చేస్తారు. ఇందుకు ఫిల్టర్‌, లేయర్స్‌లో మార్పులు ఉంటాయి. ఇంజిన్‌లో మార్పులు చేస్తారు. ఇంజిన్లలో పూర్తిగా మార్పు తేవడంతోపాటు కాలుష్యం తగ్గించే కీలక చర్యలు తీసుకుంటున్నారు. బీఎస్‌-4లో పెట్రోల్‌, డీజిల్‌లో సల్ఫర్‌ మోతాదు 50 పీపీఎం(పార్ట్స్‌ పర్‌ మిలియన్‌) ఉంటే, బీఎస్‌-6లో 10 పీపీఎం మాత్రమే ఉంటుంది. బీఎస్‌-4తో పోల్చితే బీఎస్‌-6 వాహనాల్లో 5 రెట్లు నైట్రోజన్‌ ఆక్సైడ్‌ విడుదల తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 15 లక్షలకు పైగా బీఎస్‌-4 వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

బీఎస్‌-4 నుంచి నేరుగా బీఎస్‌-6కి..

2000లో భారత్‌ స్టేజ్‌ 1 ప్రమాణాలు ప్రారంభమయ్యాయి. 2010 నుంచి దేశంలో బీఎస్‌-3 నిబంధ‌ల‌ను దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీఎస్‌-4 వాహనాలు నడుస్తున్నాయి. అయితే ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టు పిటిషన్‌ వేశారు. దీంతో వాయు కాలుష్యం తగ్గించేందుకు కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో 2017 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌-4 వాహనాలు అమల్లోకి వచ్చాయి. అదే క్రమంలో బీఎస్‌-5 లేకుండా నేరుగా బీఎస్‌-6 వాహనాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. 2020 ఏప్రిల్‌ 1 నుంచే వాటిని అమల్లోకి తేవాలని పేర్కొంది. కోర్టు తీర్పు ప్రకారం ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి బీఎస్‌-4 కొత్త వాహనాలను విక్రయించొద్దు. ఎవరైనా విక్రయించినా రవాణా శాఖ అధికారులు వాటికి రిజిస్ర్టేషన్‌ చేయరు. ఒకవేళ మార్చి 31లోపు వాహనాలను కొనుగోలు చేస్తే, అందుకు సంబంధించిన రుజువులు చూపించి ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాత కూడా రిజిస్ర్టేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

మార్కెట్‌లోకి వచ్చేస్తున్నాయి..

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త నిబంధనలకు అనుగుణంగా పలు వాహన కంపెనీలు ఇప్పటికే బీఎస్‌-6 వాహనాలు తయారు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన వాహనాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. మారుతీ సుజుకీకి కంపెనీకి చెందిన ఆల్టో, ఎకో, ఎస్‌ ప్రెసో, సెలేరియో, వేగనార్‌, స్విఫ్ట్‌, బాలెనో, ఎర్టిగా, మోడళ్లను బీఎస్‌-6 ఇంజిన్లతోనే విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా మెర్సిడెస్‌ బెంజ్‌ ఎస్‌ క్లాస్‌, ఫోర్డ్‌ ఇండియా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్‌ తదితర వాహనాలు కూడా బీఎస్‌-6 ప్రమాణాలతో మార్కెట్‌లోకి వచ్చాయి. బైక్‌లు సైతం భారత్‌ స్టేజ్‌-6 ప్రమాణాలతో విడుదల అవుతున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు వాహనాలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

స్పెషల్‌ ఫ్యూయెల్‌!

బీఎస్‌-6 వాహనాలకు ఫ్యూయెల్‌ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ ఆయిల్‌ను డెడ్‌లైన్‌లోగా అన్నిచోట్ల లభించేలా ఆయిల్‌ కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో ఈ ఇంధనం అందుబాటులో ఉంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఈ ఇంధనాన్ని తీసుకొచ్చేందుకు ఔట్‌లెట్లు రెడీ చేస్తున్నాయి. కాగా, బీఎస్‌-6 వాహనాలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ తయారు చేయడానికి కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయిల్‌ కంపెనీలు వాపోతున్నాయి.

Tags : new vehicle, bs6, Bharat Stage, Supreme court, bikes, cars, april 1.



Next Story

Most Viewed