తోబుట్టువులు… మృత్యువులోనూ తోడుగానే…

by  |
తోబుట్టువులు… మృత్యువులోనూ తోడుగానే…
X

దిశ, నిజామాబాద్: రక్తం పంచుకొని పుట్టారు, ప్రేమను పెంచుకొని పెరిగారు. కన్నోళ్లకు చెరో కన్నై ఆప్యాయంగా ఉన్నారు. అమ్మ చేసిన వంటైనా, నాన్న తెచ్చిన బట్టలైనా ఒకరివి ఒకరు వేసుకున్నారు. ఒకే బడిలో చదువుకున్నారు. ఒకే బండి మీద తిరిగారు. కానీ, ఆ బండి మీద కలిసి ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. మృత్యువులోనూ ఇద్దరూ కలిసి ఉన్నారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం రెంజర్ల గ్రామానికి చెందిన అంబటి పేర్మాగౌడ్ దంపతులకు ముగ్గురు కొడుకులు. చిన్నకుమారులైన అరుణ్, అరవింద్‌కు కొద్దిరోజుల క్రితం తండ్రి కొత్త బైక్‌ కొనిచ్చాడు. అరుణ్ డిగ్రీ చదువుతుండగా, అరవింద్‌ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇన్నిరోజులుగా బైక్‌కు సర్వీసింగ్ చేయించలేదు. మంగళవారం నుంచి సడలింపులు రావడంతో బుధవారం ఉదయం అరుణ్, అరవింద్‌ బైక్‌ సర్వీసింగ్‌ కోసం బయల్దేరారు. ఇదే క్రమంలో ముప్కాల్ మండలం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు ఎగిరి దూరంగా ఎగిరిపడ్డారు. దీంతో వారి తలకు బలంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇద్దరు కొడుకులు విగతజీవులుగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


Next Story

Most Viewed