రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి.. చూసేందుకు కన్నీటితో వెళ్తూ అన్న..

by  |
siricilla
X

దిశ, సిరిసిల్ల : విందు భోజనానికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో ఒకరి తర్వాత మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని కన్నీటితో వెళ్తున్న అన్నను బస్సు రూపంలో మృత్యువు కబళించింది. గంట వ్యవధిలో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర ఘటన సిరిసిల్ల జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరు గ్రామానికి చెందిన మల్లవేని నర్సయ్య, రాజులు అన్నదమ్ములు. నర్సయ్య ట్రాక్టర్ డ్రైవర్‌గా, రాజు మేస్త్రీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం అన్నదమ్ములిద్దరు ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలోని బంధువుల ఇంటికి విందు భోజనానికి వెళ్లారు. అనంతరం రాజు ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఈ క్రమంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధి సర్దాపూర్ బెటాలియన్ వద్ద రాజును ఎదురుగా వస్తున్న కంటేనర్ ఢీకొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. రాజు మరణ వార్త తెలుసుకుని తమ్ముడిని చూడటానికి వస్తున్న అన్న నర్సయ్య సైతం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడిక్కడే దుర్మరణం పాలయ్యాడు. గంట వ్యవధిలో ఇద్దరు అన్నదమ్ముల మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.



Next Story

Most Viewed