బ్రిటానియా తొలి త్రైమాసిక లాభం 118 శాతం వృద్ధి

by  |
బ్రిటానియా తొలి త్రైమాసిక లాభం 118 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశపు అతిపెద్ద బిస్కెట్ తయారీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో నికర లాభం 118.25 శాతం పెరిగి రూ. 542.68 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ. 248.64 కోట్ల నికర లాభాన్ని కంపెనీ వెల్లడించింది. ఏకీకృత ఆదాయం 26.67 శాతం పెరిగి రూ. 3,420.67 కోట్లకు చేరుకుంది. రూ. 93.68 కోట్ల ఇతర ఆదాయాలను ఇందులోంచి మినహాయించింది.

ఇక, వడ్డీకి ముందు ఏకీకృత ఆదాయం రూ. 717.4 కోట్లుగా కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. అంతకుముందు ఏడాది ఇది రూ. 395 కోట్లు. కంపెనీ మార్జిన్ 20.98 శాతంగా నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సానికి తొలి త్రైమాసికంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గణనీయమైన అంతరాయం ఏర్పడిందని, సరఫరా వ్యవస్థతో పాటు కర్మాగారాలు మూతపడటం, రవాణా, విక్రేతలు లాక్‌డౌన్ ప్రభావానికి లోనయ్యారని కంపెనీ వెల్లడించింది. అయితే, మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకు కరోనా పరిస్థితులను వేగంగా అంచనా వేసి మార్కెట్ డిమాండ్‌ను తీర్చడంలో విజయం సాధించామని బ్రిటనియా ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అన్నారు.



Next Story

Most Viewed