భారత్‌లో తయారీ సామర్థ్యం పెంచేందుకు వీవో భారీ పెట్టుబడులు..!

by Web Desk |
భారత్‌లో తయారీ సామర్థ్యం పెంచేందుకు వీవో భారీ పెట్టుబడులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వీవో భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం స్థానికంగా తయారీ సామర్థ్యాన్ని పెంచడం కాకుండా ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. దేశీయంగా స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం వీవో సంస్థ రాబోయే రెండేళ్లలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు కంపెనీ ఇండియా విభాగం డైరెక్టర్ పైగమ్ డేనిష్ చెప్పారు. భారత్‌లో వ్యాపార వృద్ధికి కంపెనీ మొత్తం రూ. 7,500 కోట్ల పెట్టుబడులను పెట్టాలని లక్ష్యంగా ఉంది. ఇప్పటికే కంపెనీ రూ. 1,900 కోట్లను ఇన్వెస్ట్ చేసిందని ఆయన పేర్కొన్నారు. 2023 నాటికి మరో రూ. 3,500 కోట్లను పెట్టుబడి పెట్టనున్నాం. ఈ మొత్తం తయారీ సామర్థ్యం పెంపు కోసం మాత్రమే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సరఫరాను పెంచనున్నామని, ఈ ఏడాది నుంచి ఇతర దేశాలకు ఎగుమతులను కూడా చేపడతామని డేనిష్ వివరించారు. ప్రస్తుతం దేశంలో వీవో 10 కోట్ల మంది వినియోగదారులను అధిగమించింది. గత కొన్నేళ్లలో కంపెనీ మెరుగైన వృద్ధి సాధిస్తోంది. దీనికి అనుగుణంగా భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6 కోట్ల నుంచి 12 కోట్లకు రెట్టింపు చేయాలని లక్ష్యంగా ఉంది. కొత్త పెట్టుబడుల ద్వారా ఉద్యోగుల సంఖ్య 40,000కు పైగా పెరిగింది. 2023 నాటికి మరో 5,000 మందికి ఉపాధి లభించనుంది. తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా కంపెనీ 95 శాతం బ్యాటరీలను, 60 శాతం ఛార్జర్లను స్థానికంగానే రూపొందిస్తున్నట్టు డేనిష్ వెల్లడించారు.


Next Story

Most Viewed